జాతీయ కాంగ్రెస్​

జాతీయ కాంగ్రెస్​

19వ శతాబ్దంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యంతో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే, అఖిల భారత ప్రాతిపదికగా ఏర్పడిన సంఘ ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​. విలియం వెడ్​బర్న్​, చార్లెస్​ బ్రాడ్​లా, జార్జీ యూల్​ల సహాయంతో ఏఓ హ్యూమ్​ ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ను 1885, డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్​దాస్​ తేజ్​పాల్​ సంస్కృత కళాశాలలో స్థాపించాడు. ఈ సంస్థ అసలు పేరు అయిన ఇండియన్​ యూనియన్​ను ఏఓ హ్యూమ్​ ప్రతిపాదించాడు. కానీ మొదటి సమావేశంలో భారత్​ జాతీయ కాంగ్రెస్​ అనే పేరును దాదాబాయి నౌరోజీ సూచించారు.

ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఏఓ హ్యూమ్​, ఫిరోజ్​షా మెహతా, దాదాభాయ్​ నౌరోజీ, దిన్షావాచా, డబ్ల్యూసీ బెనర్జీ. బద్రుద్దీన్​ త్యాబ్జీ. 1888లో లండన్​లో ఏర్పడ్డ ఐఎన్​సీ బ్రిటిష్​ కమిటీ 1889లో ఇండియన్​ అనే వార పత్రికను ప్రారంభించి భారతీయుల బాధలను బ్రిటిష్​ ప్రజలకు, వారి శాసనసభలకు తెలియజేయాలని పూనుకున్నారు. 

రక్షక కవాట సిద్ధాంతం

1857 తిరుగుబాటు తర్వాత భారత్​లో బ్రిటిష్​కు వ్యతిరేకంగా మరో తిరుగుబాటు జరగకుండా జాగ్రత్త పడటానికి, భారతీయుల కోసం ఒక సంస్థాపరమైన వేదికను అందించడం కోసం ఈ సిద్ధాంతం ఉద్దేశించడమైంది. ఈ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ మితవాదులపై లాలా లజపతిరాయ్​ 1916లో యంగ్​ ఇండియా పుస్తకంలో విరుచుకుపడ్డాడు. ఆర్​.పి.దత్తా తన ఇండియా టు డే ద్వారా లాలా లజపతిరాయ్​ చేసిన వ్యాఖ్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. 1939లో ఆర్​ఎస్​ఎస్​ అధినేత ఎంఎస్​ గోల్వాల్కర్​ ఈ సిద్ధాంతం ఆధారంగా కాంగ్రెస్​ను విమర్శించాడు. సి.ఎఫ్​.ఆండ్రూస్​, గిరిజా ముఖర్జీ తమ గ్రంథాలైన రైజ్​ అండ్​ గ్రోత్​ ఆఫ్​ కాంగ్రెస్​ ఇన్​ ఇండియాలో ఈ సిద్ధాంతాన్ని ఆమోదించాడు. 

మొదటి సమావేశం : ఈ సమావేశాన్ని 1885 డిసెంబర్​ 25న పుణెలో జరపాలని నిర్ణయించారు. కాని అక్కడ ప్లేగు వ్యాధి వ్యాప్తి కారణంగా బొంబాయికి మార్చారు. 1885 డిసెంబర్​ 28న తేజ్​పాల్​ సంస్కృత కళాశాలలో గోకుల్​దాస్​ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహించగా కార్యదర్శులుగా ఏఓ హ్యూమ్​, కె.టి.తెలాంగ్​లు పనిచేశారు. ఈ సమావేశానికి 72 మంది సభ్యులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి పి.ఆనందాచార్యులు, గుత్తి కేశవ పిళ్లైలు, హైదరాబాద్​ ప్రాంతం నుంచి అఘోరనాథ ఛటోపాధ్యాయ, రామచంద్రపిళ్లై, ముల్లా అబ్దుల్​ ఖయ్యుంలు హాజరయ్యారు. 

తీర్మానాలు

  •     ఐసీఎస్​ పరీక్షలను ఒకే సమయంలో భారత్​, ఇంగ్లాండ్​లో నిర్వహించాలని, పోటీ పరీక్షలకు వయోపరిమితిని పెంచాలని తీర్మానించారు. దీనిని సుబ్రమణ్య అయ్యర్​ ప్రవేశపెట్టారు.
  •     భారతదేశంలోని పరిపాలన గురించి సమీక్ష జరపడానికి ఒక రాయల్​ కమిషన్​ ఏర్పరచడం.
  •     భారత వ్యవహారాల కార్యదర్శి, ఇండియా కౌన్సిల్​ను రద్దు చేయడం.
  •     వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అయోధ్య, పంజాబ్​ల్లో శాసనసభల ఏర్పాటు.
  •     కేంద్ర, ప్రాంతీయ శాసన మండలులలో ఎన్నికైన సభ్యులకు ఇతోధిక దామాషా కల్పించడం.
  •     కామన్స్​ సభలో భారతదేశంలోని శాసనమండలుల నుంచి అధిక్షేపాలను పరిశీలించడానికి ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పరచడం.
  •     సైనిక ఖర్చు తగ్గింపు, ఖర్చును భారత్​, ఇంగ్లాండ్​లు న్యాయపరమైన నిష్పత్తిలో భరించడం.

రెండో సమావేశం(1886 డిసెంబర్​ 27, కలకత్తా) : ఈ సమావేశానికి సురేంద్రనాథ్​ బెనర్జీ హాజరయ్యాడు. మొత్తం 436 మంది ప్రతినిధులు హాజరు కాగా, అధిక సంఖ్యలో బెంగాల్​ నుంచి 230 మంది హాజరయ్యారు. 

తీర్మానాలు : శాసనమండలుల విస్తరణ, సివిల్​ సర్వీసు పరీక్షల విషయ పరిశీలనకు కమిటీ. 

ఐదో సమావేశం(1889, బొంబాయి) : భారత్​లోని బ్రిటిష్​ ప్రభుత్వాధికారుల వ్యతిరేక ధోరణి దృష్ట్యా బ్రిటన్​లో కాంగ్రెస్​ ఉద్ధృత ప్రచారం చేయాలని హ్యూమ్​ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్​ ప్రతినిధి సంస్థగా ఒక బ్రిటిష్​ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి వెడ్​బర్న్​ అధ్యక్షునిగా నౌరోజీతోపాటు కెయిన్​, బ్రైట్​లు సభ్యులుగా, డిగ్బీని కార్యదర్శిగా నియమించారు. 

తీర్మానాలు : కేంద్ర, రాష్ట్ర శాసనమండలులలో ఎన్నికైన సభ్యుల సంఖ్య సగానికి తగ్గకుండా ఉండాలి. అధికార సభ్యుల సంఖ్య నాలుగో వంతుకు పరిమితం కావాలి. మిగతా సభ్యులు ప్రభుత్వ నియమితులు.
    

  • ఎన్నికలకు రెవెన్యూ జిలలాయే ప్రాదేశిక నియోజకవర్గమై ఉండాలి.
  •     21 సంవత్సరాల కనీస వయస్సు ఉన్న వారు ఓటర్లు, వీరు కేంద్ర శాసన మండలికి 50 లక్షల జనాభాకు ఒక సభ్యుడు, రాష్ట్ర శాసనమండలికి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు చొప్పున సభ్యులను ఎన్నుకుంటారు.
  •     పార్శీ, క్రైస్తవ, ముస్లిం, హిందూ వర్గాలు కొన్ని నియోజకవర్గాల్లో అల్ప సంఖ్యాక  వర్గాలుగా ఉండవచ్చు. ఎన్నికైన సభ్యుల సంఖ్య జనాభాలోని వివిధ వర్గాల దామాషాను ప్రతిఫలించే విధంగా ఉండాలి. 

12వ సమావేశం(1896, కలకత్తా) : ఈ సమావేశంలో మొదటిసారిగా వందేమాతరం ఆలపించారు. దీనిని దేవేంద్రనాథ్​ ఠాగూర్​ పాడారు. 1906 సెప్టెంబర్​ 7న వందేమాతరం గీతానాకి జాతీయ హోదా లభించింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగ పరిషత్​ వందేమాతర గీతాన్ని జాతీయ గేయంగా ఆమోదించింది.

23వ సమావేశం(1907, సూరత్​) : ఈ సమావేశంలో ఐఎన్​సీ స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణల విషయంలో భేదాభిప్రాయాల వల్ల అతివాదులు, మితవాదులుగా విడిపోయింది. నాగ్​పూర్​లో నిర్వహించాల్సిన సమావేశం సూరత్​కు మార్చబడింది. ఇక్కడ మితవాద నాయకుల బలం ఎక్కువ. 

26వ సమావేశం (1911, కోల్​కత్తా) : ఈ సమావేశంలో మొదటిసారిగా జనగణమన  గీతాన్ని ఆలపించారు. దీనిని రవీంద్రనాథ్​ ఠాగూర్​ 1919 ఫిబ్రవరి 28న మదనపల్లెలో మార్నింగ్​ సాంగ్​ ఆఫ్​ ఇండియా అనే పేరుతో ఇంగ్లీష్​లోకి అనువాదం చేశారు.

44వ సమావేశం(1929 లాహోర్​) : ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్​ తీర్మానం ఆమోదించబడింది. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా జవహర్​లాల్​ నెహ్రూ ఎగురవేశాడు.

ఐఎన్​సీకి అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు

1888    అలహాబాద్    జార్జ్​ యూల్​
1889    బొంబాయి      విలియం వెడ్​బర్న్​
1894     మద్రాస్​        అల్ఫ్రెడ్​ వెబ్​
1904    బొంబాయి      సర్​ హెన్రీ కాటన్​
1910    అలహాబాద్​   విలియం వెడ్​బర్న్​

ఐఎన్​సీకి మొదట అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు

1885    డబ్ల్యూసీ బెనర్జీ               తొలి హిందువు
1886    దాదాబాయి నౌరోజీ        తొలి పార్శి
1887    బద్రుద్దీన్​ త్యాబ్జి             తొలి ముస్లిం
1888    జార్జ్​ యూల్​                    తొలి ఆంగ్లేయుడు
1891    పి.ఆనందాచార్యులు      ఆంధ్రుడు
1917    అనిబిసెంట్​                   తొలి విదేశీ వనిత
1925   సరోజినీ నాయుడు     భారతీయ మహిళ

ఐఎన్​సీ సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళల సంఖ్య - 3

అనిబిసెంట్​              కలకత్తా(1917)
సరోజినీ నాయుడు    కాన్పూర్​ (1925)
నిళినీ సేన్​గుప్తా         కలకత్తా (1933)