చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ భారత్కు చెందిన ఓ నర్సుకు సోకింది. సౌదీ అరేబియాలోని అల్ హయత్ హాస్పిటల్లో పనిచేస్తున్న కేరళ నర్సు ఈ కొత్త వైరస్ బారిన పడినట్లు అక్కడి డాక్టర్లు తేల్చారు. ఆ దేశంలో పని చేస్తున్న మొత్తం 100 మంది ఇండియన్ నర్సులకు టెస్టులు చేశారు. వారిలో కేరళకు చెందిన ఓ నర్సుకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ నర్సుకు అసీర్ నేషనల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులతో మాట్లాడి అక్కడ పనిచేస్తున్న నర్సుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు ఆయన తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యంతో చర్చించి, మిగిలిన వారికి ఈ వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళ సీఎం పినరాయి విజయన్.. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. ఈ అంశంపై సౌదీ ప్రభుత్వంతో మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్కడ పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది కేరళ నర్సులే ఉన్నారని, మిగతా వారికి కరోనా వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
