భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్ ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. మరో ఇద్దరితో కలిసి నిన్న(శుక్రవారం) ఆమె ఈ అవార్డును గెలుచుకున్నారు. చైనా జిన్జియాంగ్ ప్రాంతంలో రహస్యంగా వందలాది జైళ్లు, నిర్బంధ శిబిరాలు నిర్మించి.. వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకుని.. చిత్ర హింసలకు గురి చేస్తోన్న విషయాలను తెలిపినందుకు మేఘ రాజగోపాలన్ ఈ బహుమతి గెలుచుకున్నారు. పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న ఇద్దరు భారత సంతతి జర్నలిస్టులలో అమెరికా బజ్ఫీడ్ న్యూస్కు చెందిన ఎంఎస్ రాజగోపాలన్ ఒకరు. ఈమె ప్రచురించిన జిన్జియాంగ్ సిరీస్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది.
2017 లో, జిన్జియాంగ్లో చైనా వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించిన కొద్దికాలానికే, రాజగోపాలన్ ఒక నిర్బంధ శిబిరాన్ని సందర్శించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తమ దేశంలో అటువంటి ప్రదేశాలు లేవని చైనా ఖండించిన సమయంలో.. బజ్ఫీడ్ న్యూస్ ఈ విషయాన్ని బయటపెట్టింది.