
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 2008లో అత్యంత ప్రజాదరణతో మొదలైనఈ మెగా లీగ్ క్రికెట్ గతినే మార్చేసింది. ఈ ఒకటిన్నర దశాబ్దం కాలంలో క్రికెట్ ఆడే విధానంలో వచ్చిన చాలా మార్పులకు నాందిగా మారింది. ఇప్పుడు షార్ట్ ఫార్మాట్లో మరో విప్లవాత్మక ఆవిష్కరణకు శుక్రవారం మొదలయ్యే ఐపీఎల్16వ సీజన్ వేదిక కానుంది. ఈ సీజన్లో ప్రవేశ పెడుతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ ఈ లీగ్ను సరికొత్తగా మార్చనుంది.
ఏమిటీ రూల్?
ఏ ఫార్మాట్లో అయినా 11 మంది ప్లేయర్లే ఆడాలి. ఎవరైనా గాయపడితే వారి స్థానాల్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ను అనుమతిస్తారు. టెస్టుల్లో కంకషన్ (తలకు గాయం) అయిన ఆటగాడి స్థానంలో వచ్చే ప్లేయర్కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఇస్తున్నారు. అయితే, ఫుట్బాల్లో సబ్స్టిట్యూట్స్ మాదిరిగా ఐపీఎల్లో మ్యాచ్ మధ్యలో ఓ ప్లేయర్ స్థానంలో మరొకరిని బరిలోకి దింపి బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం కల్పించడమే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. టీ20లను మరింత రసవత్తరంగా మార్చి, ఆటకు ఆదరణ పెంచేందుకు ఐపీఎల్లో బీసీసీఐ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇందుకోసం మ్యాచ్కు ముందు ఇరు జట్లూ 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్ (ఇంపాక్ట్) ప్లేయర్ల పేర్లు ఇవ్వాలి. మ్యాచ్లో పరిస్థితికి తగ్గట్టుగా తుదిజట్టులోని ప్లేయర్ను తప్పించి అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ను బరిలోకి దింపొచ్చు. ఉదాహరణకు బౌలింగ్ చేస్తున్న జట్టు తమకు లెగ్ స్పిన్నర్ లేదా ఆఫ్ స్పిన్నర్ అవసరం అనుకుంటే అలాంటి ప్లేయర్ను తీసుకోవచ్చు. ఛేజింగ్ చేస్తున్న టీమ్ తమకు లెఫ్టాండ్ బ్యాటర్ కావాలనుకుంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓవర్ ముగిశాక, వికెట్ పడినప్పుడు, బ్యాటర్ రిటైర్ అయిన సందర్భాల్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడు. ఈ విషయం ముందుగా అంపైర్కు తెలియజేస్తే అతను ఇంపాక్ట్ ప్లేయర్కు సంజ్ఞ చేస్తాడు. ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్ కోసం బయటికి వెళ్లిన ఆటగాడిని మళ్లీ గ్రౌండ్లోకి అనుమతించరు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ ప్లేస్లో వచ్చినా.. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. తుది జట్టులో ముగ్గురు, అంతకంటే తక్కువ మంది ఫారిన్ ప్లేయర్లు ఉంటే తప్ప ఇంపాక్ట్ ప్లేయర్గా ఇండియన్ ప్లేయర్నే తీసుకోవాలి. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ను సక్సెస్ఫుల్గా పరీక్షించారు. డొమెస్టిక్ ప్లేయర్లకు దీనిపై అవగాహన ఏర్పడింది. ఐపీఎల్లోనూ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ టీ20ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలయ్యే అవకాశం ఉంటుంది.
టాస్ ప్రభావం తగ్గేలా..
టీ20ల్లో టాస్ ప్రభావం చాలా ఉంటోంది. ముఖ్యంగా ఛేజింగ్ టీమ్కు అనుకూలం అవుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో టాస్ ప్రభావం తగ్గనుంది. పైగా టాస్ తర్వాతే తుది జట్టును ప్రకటించే అవకాశాన్ని ఈసారి నుంచి బీసీసీఐ కల్పిస్తోంది. ఇరు జట్ల కెప్టెన్లు రెండు టీమ్ షీట్స్తో టాస్కు వెళ్లనున్నారు. టాస్ ఫలితాన్ని బట్టి ఏ జట్టుతో ఆడాలో నిర్ణయించుకుంటారు. ఎలాగూ ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి టాస్ పాత్ర పరిమితం కానుంది.
ఓల్డ్ ప్లేయర్లకు గోల్డెన్ రూల్
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్రౌండర్ల సంఖ్య తక్కువగా ఉన్న జట్లకు హెల్ప్ అవనుంది. అలాగే, అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్), పీయుష్ చావ్లా (ముంబై ఇండియన్స్) లాంటి వెటరన్ ప్లేయర్లకు ఇది గోల్డెన్ రూల్ కానుంది. ఏజ్ దృష్ట్యా ఈ ఇద్దరూ గ్రౌండ్లో చురుగ్గా కదల్లేరు. కానీ, వీరి లెగ్ స్పిన్ ఇండియా వికెట్లపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇన్నింగ్స్ చివర్లో వీళ్లను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని ఒకటి రెండు ఓవర్లు బౌలింగ్ చేయిస్తే జట్లకు ప్రయోజనం ఉండనుంది.
కొత్త కెప్టెన్లు వచ్చిన్రు
ఈ సీజన్లో చాలా జట్లలో ఆటగాళ్లు మారారు. పలు టీమ్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. పలు జట్లకు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు. సన్రైజర్స్ హైదరాబాద్ను ఐడెన్ మార్క్రమ్ నడిపించనున్నాడు. రిషబ్ పంత్కు యాక్సిడెంట్ అవ్వడంతో ఢిల్లీ కెప్టెన్సీని డేవిడ్ వార్నర్కు అప్పగించారు. మయాంక్ అగర్వాల్ను వదులుకున్న పంజాబ్ కింగ్స్ వెటరన్ బ్యాటర్ శిఖర్ ధవన్కు సారథ్యం ఇచ్చింది. శ్రేయస్ అయ్యర్ వెన్నుగాయానికి గురవడంతో యంగ్ బ్యాటర్ నితీశ్ రాణా కోల్కతా నైట్ రైడర్స్కు కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు.
వీళ్లు కనిపిస్తలే
ఐపీఎల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలతో ఈ సీజన్కు దూరమయ్యారు. ముంబై పేస్ లీడర్, యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో సీజన్ నుంచి తప్పుకున్నాడు. యాక్సిడెంట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. గోల్ఫ్ ఆడుతుండగా గాయపడ్డ పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో, రాజస్తాన్ రాయల్స్ కీలక పేసర్ ప్రసిధ్ కృష్ణ టోర్నీ నుంచి వైదొలిగారు. వెన్నుగాయం నుంచి కోలుకుంటే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి దశలో బరిలోకి దిగే చాన్సుంది.