
- ఏ సమస్యను అయినా పరిష్కరిస్తయ్
- నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించే సత్తా స్టార్టప్లకు ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, బిజినెస్ చేయడానికి ఇవి సరికొత్త, వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నాయని మెచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన స్టార్టప్ల అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చౌకగా నెట్ అందుబాటులోకి రావడం, ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు వాడటం, ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సాయం అందడం, ట్యాలెంట్ పూల్ పెరగడం వల్ల స్టార్టప్ ల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎకనమిక్ గ్రోత్ స్ట్రాటజీలో స్టార్టప్ లు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. ‘‘స్టార్టప్ల వల్ల భారీ స్కిల్డ్ జాబ్స్ వస్తాయి. ఆటోమేషన్వల్ల కొన్ని ఉద్యోగాలు పోతున్నాయి. ఈ సమస్య కూడా పరిష్కారమవుతుంది. ఎన్నో అవకాశాలు ఉన్న కొత్త బిజినెస్లలోకి స్టార్టప్ లు చొచ్చుకుపోతున్నాయి. ఉదాహరణకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో అమర్చే బ్యాటరీల తయారీ బిజినెస్. పీఎల్ఐ వంటి స్కీముల వల్ల ఎన్నో సబ్సిడీలు వస్తున్నాయి. స్టార్టప్ ల ఇన్నోవేషన్లు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2015–16లో డొమెస్టిక్ పేటెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య 12 వేలు కాగా, 2020–21లో వీటి సంఖ్య 25 వేలకు పెరిగింది. అంటే స్టార్టప్ లు పెద్ద ఎత్తున కొత్త టెక్నాలజీలను, పద్ధతులను కనుగొంటున్నాయని అర్థమవుతోంది. అందుకే చాలా స్టార్టప్ లు యూనికార్న్లుగా ఎదుగుతున్నాయి. గత మూడు నెలల్లో 11 స్టార్టప్ లు యూనికార్న్లుగా ఎదిగాయి. దాదాపు నాలుగు నెలలకు ఒక యూనికార్న్ ఏర్పడుతోంది. మనదేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలను ఇవి పరిష్కరిస్తున్నాయి”అని కాంత్ వివరించారు.
ఆకాశమే హద్దు..
స్టార్టప్ లకు కేవలం ఇండియా మాత్రమే మార్కెట్ కాదని, ఇవి ఎదిగే కొద్దీ, సమస్యలను పరిష్కరించే కొద్దీ ప్రపంచమంతటా విస్తరించవచ్చని అన్నారు. త్వరలో ప్రపంచంలోని 500 కోట్ల మంది పేదల నుంచి మధ్యతరగతికి ఎదుగుతారని, వీరందరికీ స్టార్టప్ లు సేవలను అందించవచ్చని చెప్పారు. స్టార్టప్ ల అభివృద్ధి కోసం మొదలుపెట్టిన ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం వల్ల ఆశించిన లాభాలను అందుకున్నామని, గత కొన్నేళ్లలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎన్నో అడ్డంకులను దాటుకొని అద్భుతంగా ఎదిగిందని మెచ్చుకున్నారు. ‘‘2016లో మనదేశంలోని స్టార్టప్ ల సంఖ్య చాలా తక్కువ. వాటికి అందిన సాయమూ తక్కువే! ఇన్వెస్ట్మెంట్లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అత్యంత సమర్థమైన స్టార్టప్ ఇకోసిస్టమ్ ఉన్న దేశాల్లో మనకూ స్థానం దక్కింది. ఎక్కువ స్టార్టప్లు ఉన్న దేశాల్లో ఇండియాకు మూడోస్థానం వచ్చింది. ఇప్పటి వరకు మనదేశంలో 67 వేల స్టార్టప్ లు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. ఇది చాలా గొప్ప విషయం”అని అన్నారు. స్టార్టప్ లు పాత వ్యాపార పద్ధతులను తొలగించి కొత్తవి తెచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది జనవరిలో అన్నారు. మనదేశంలోని స్టార్టప్ ల డైరెక్టర్లలో 44 శాతం మంది మహిళలు ఉన్నారని, మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని ప్రశంసించారు. 45 శాతం స్టార్టప్ లు చిన్న సిటీల్లో ఉన్నాయని, లోకల్ ప్రొడక్టులకు ఇవి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నాయని అన్నారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి రిజిస్ట్రేషన్ను సింపుల్గా మార్చేశాం. మూడేళ్లపాటు ట్యాక్స్రాయితీలు ఇస్తున్నాం. గవర్నమెంటు కాంట్రాక్టులు తీసుకునేందుకూ అనుమతి ఇచ్చాం. పేటెంట్ ఫైలింగ్ ఖర్చును తగ్గించాం. ఇండియాలో బలమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటంతో మన స్టార్టప్ లు సత్తా చాటుతున్నాయి. యూపీఐ, ఆధార్, ఇన్స్టంట్ ఆర్టీపీఎస్వంటి డిజిటల్ ఇన్ఫ్రా వల్ల ప్రభుత్వాలు, బిజినెస్లు, స్టార్టప్ లు ఎన్నో విధానాల ఫైనాన్షియల్ సర్వీసులను అందించగలుగుతున్నాయి”అని అమితాబ్ కాంత్ వివరించారు.