
మామల్లపురం: చెస్ ఒలింపియాడ్లో ఇండియన్ యంగ్ గ్రాండ్మాస్టర్ల టీమ్ తొలి ఓటమిని ఎదుర్కొంది. ఓపెన్ సెక్షన్లో బుధవారం జరిగిన ఆరో రౌండ్లో ఇండియా–బి టీమ్ 1.5–2.5 తేడాతో ఆర్మేనియా చేతిలో ఓడింది. గుకేశ్.. సర్గాసియన్ గాబ్రియెల్పై గెలిచి వరుసగా ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. నీహల్ సరీన్.. మెల్క్మయన్ హరాంత్ మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది. కానీ తర్వాతి గేమ్స్లో ఆదిభన్, రౌనక్ సద్వాని.. వరుసగా టెర్ సహకాన్ సామ్వెల్, హోవానిసియన్ రొబెర్ట్ చేతిలో ఓడారు. ఇండియా–ఎ టీమ్ 2–2తో ఉజ్బెకిస్తాన్తో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఇండియా–సి టీమ్ 3.5–0.5తో లిథువేనియాపై గెలిచింది. ఇక విమెన్స్ సెక్షన్లో తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, ఆర్. వైశాలి విజయాలు సాధించడంతో ఇండియా–ఎ టీమ్ 3–1తో బలమైన జార్జియాకు చెక్ పెట్టింది. ఇండియా–బి టీమ్ 2–2తో చెక్ రిపబ్లిక్తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఇండియా–సి టీమ్ 3–1తో ఆస్ట్రేలియాను ఓడించింది.