సక్సెస్​తో ఇస్రో బోణీ..ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్ ఫుల్

సక్సెస్​తో ఇస్రో బోణీ..ఈ ఏడాది తొలి ప్రయోగం సక్సెస్ ఫుల్

కొత్త సంవత్సరంలో మొదటి ప్రయోగాన్ని సక్సెస్​తో ప్రారంభించింది ఇస్రో. 2020కి సక్సెస్​తో వెల్​కమ్​ చెప్పింది. టెలికమ్యూనికేషన్స్​ శాటిలైట్​ జీశాట్​30 సక్సెస్​ఫుల్​గా కక్ష్యలోకి చేర్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఏరియన్​స్పేస్​కు చెందిన ఏరియన్​5 వీఏ251 రాకెట్​, జీశాట్​30ని నింగిలోకి మోసుకెళ్లింది. ఫ్రెంచ్​గయానాలోని కౌరూలో ఉన్న ఏరియన్​ లాంచ్​ కాంప్లెక్స్​ నుంచి ప్రయోగం జరిగింది. నింగికెగిసిన 38 నిమిషాల 25 సెకన్లకు జియోసింక్రనస్​ ట్రాన్స్​ఫర్​ ఆర్బిట్​లోకి ఉపగ్రహాన్ని రాకెట్​ చేర్చింది. ఇస్రో తరఫున యూఆర్​ రావ్​ శాటిలైట్​ సెంటర్​ డైరెక్టర్​ పి. కున్హి కృష్ణన్​ కౌరూకు వెళ్లారు. ప్రయోగం సక్సెస్​ అయిన వెంటనే ఇస్రో టీంకు ఆయన అభినందనలు తెలిపారు.

శాటిలైట్​ ఉపయోగాలేంటి?

ఇంతకుముందు ఇస్రో ప్రయోగించిన ఇన్​శాట్/జీశాట్​ సిరీస్​లో భాగమే ఈ జీశాట్​30 ఉపగ్రహం. ప్రస్తుతం కమ్యూనికేషన్ల కోసం నింగిలోకి పంపిన ఇన్​శాట్​4ఏకి రీప్లేస్​మెంట్​గా జీశాట్​30ని ఇస్రో పంపించింది. డీటీహెచ్​ టెలివిజన్​ సర్వీసెస్​, ఏటీఎంల కోసం వీశాట్​కనెక్టివిటీ, స్టాక్​ఎక్స్​చేంజ్​, టెలివిజన్​ అప్​లింకింగ్​, టెలిపోర్ట్​ సర్వీసెస్‌, డిజిటల్​ శాటిలైట్​ న్యూస్​ గేథరింగ్​ (డీఎస్​ఎన్​జీ), ఈ–గవర్నెన్స్​ అప్లికేషన్ల కోసం జీశాట్​30 సేవలు అందించనుంది. కేయూ బ్యాండ్​, సీ బ్యాండ్​ ఫ్రీక్వెన్సీల్లో జీశాట్​30 సేవలందిస్తుంది. కేయూ బ్యాండ్​ ద్వారా దేశ భూభాగంతో పాటు ఐలాండ్​లలో కమ్యూనికేషన్​ సర్వీసులు అందిస్తుంది. సీ బ్యాండ్​ ద్వారా గల్ఫ్​ కంట్రీస్​తో పాటు పలు ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాల్లోనూ కమ్యూనికేషన్​ సేవలు అందుతాయి.

ఈక్వేటర్​కు 36 వేల కిలోమీటర్ల ఎత్తులో

ఉపగ్రహాన్ని రాకెట్​ వదిలిన వెంటనే కర్ణాటకలోని హసన్​ వద్ద ఉన్న ఇస్రో మాస్టర్​ కంట్రోల్​ ఫెసిలిటీ (ఎంసీఎఫ్​), శాటిలైట్​ను కంట్రోల్​లోకి తీసుకుంది. భూమధ్య రేఖకు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోకి శాటిలైట్​ను చేర్చేందుకు ఎంసీఎఫ్​ తర్వాతి కక్ష్య మార్పులను చేపట్టనుంది. ఉపగ్రహంలోని ప్రొపల్షన్​ సిస్టమ్​లను వాడుకుంటూ ఆ కక్ష్య మార్పులను చేపట్టనుంది. చివరి దశలో రెండు సోలార్​ పానెళ్లతో పాటు యాంటెనా రిఫ్లెక్టర్లను ఓపెన్‌ చేస్తుంది.

యూరోపియన్​ శాటిలైట్​ కూడా

జీశాట్​30తో పాటు యూటెల్​శాట్​ కనెక్ట్​ అనే యూరోపియన్​ శాటిలైట్​ను ఏరియన్​5 రాకెట్​ ద్వారా ప్రయోగించారు. ఇది కూడా జీశాట్​30 లాగానే టెలికమ్యూనికేషన్​ ఉపగ్రహమే. యూటెల్​శాట్​ కోసం థేల్స్​ ఎలీనియా స్పేస్​ అనే సంస్థ ఆ ఉపగ్రహాన్ని తయారు చేసింది. జీశాట్​30 కన్నా ముందు ఈ ఉపగ్రహాన్నే రాకెట్​ కక్ష్యలోకి చేర్చింది. రాకెట్​ గాల్లోకి లేచిన 27 నిమిషాలకు దానిని నిర్దేశిత కక్ష్యలోకి పంపింది.

1981లో తొలిసారిగా

ఏరియన్​ స్పేస్​ సేవలను ఇస్రో తొలిసారిగా 1981లో వినియోగించుకుంది. యాపిల్​ ఎక్స్​పెరిమెంట్​ శాటిలైట్​ ప్రయోగాన్ని ఏరియన్​ ఫ్లైట్​ ఎల్​03 రాకెట్​ ద్వారా చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పుడు జీశాట్​30 దాకా ఏరియన్​స్పేస్​ సంస్థ ఇండియాకు చెందిన 24 శాటిలైట్లను నింగిలోకి పంపించింది.