31 నెలల గరిష్టానికి తయారీ పీఎంఐ

31 నెలల గరిష్టానికి తయారీ పీఎంఐ

న్యూఢిల్లీ: దేశంలో యాక్టివిటీ జోరందుకోవడంతో మాన్యుఫాక్చరింగ్​ పీఎంఐ మే నెలలో 31 నెలల గరిష్టానికి చేరింది. తయారీ రంగానికి  కొత్త ఆర్డర్లు పెరగడం, మార్కెట్​ కండిషన్లు అనుకూలంగా ఉండటంతోపాటు, కొత్త ఉపాధి అవకాశాలూ కలిగాయని నెలవారీ పీఎంఐ రిపోర్టు  తెలిపింది. ఎస్​ అండ్​ పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్​ పర్చేజింగ్​ మేనేజర్స్​ ఇండెక్స్​ (పీఎంఐ) ఏప్రిల్​లోని 57.2 నుంచి మే నెలలో 58.7 కి పెరిగింది. అక్టోబర్​ 2020 నుంచి చూస్తే ఈ రంగం ఇంత ఇంప్రూవ్​మెంట్​ ఎప్పుడూ చూపించలేదని పీఎంఐ సర్వే రిపోర్టు పేర్కొంది.

వరసగా 23 వ నెలలోనూ ఆపరేటింగ్​ కండిషన్లు బాగా మెరుగయినట్లు మే  పీఎంఐ డేటా వెల్లడిస్తోంది. పీఎంఐ 50 కి మించితే ఆ సెక్టార్​  విస్తరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ 50 కి దిగువన నమోదైతే కుచించుకుంటున్నట్లు తెలుసుకోవాలి. దేశంలోనూ, దేశం బయటా ఇండియాలో తయారవుతున్న వస్తువులకు గిరాకీ ఎక్కువగా ఉందనడానికి పెరుగుతున్న సేల్స్​ నిదర్శనంగా నిలుస్తాయని పీఎంఐ సర్వే రిపోర్టు పేర్కొంది.  డొమెస్టిక్​ ఆర్డర్ల పెరుగుదల వల్ల ఎకానమీ ఫౌండేషన్​ పటిష్టమవుతుందని వివరించింది.