
న్యూఢిల్లీ : 2022 ఆర్థిక సంవత్సరం నుంచి ఔట్వర్డ్ రెమిటెన్స్లు పెరుగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో, భారతీయులు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశాలకు పంపిన డబ్బు రికార్డు గరిష్ట స్థాయిలో 18.34 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రెమిటెన్స్తో పోలిస్తే ఇది 37 శాతం పెరిగింది. భారతీయులు ఒక ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్–- మార్చి) 2,50,000 డాలర్ల వరకు విదేశాలకు ఉచితంగా పంపవచ్చు. కరోనా సమయంలో ఎల్ఆర్ఎస్ చెల్లింపులు తగ్గిపోయినప్పటికీ, ఇది 2022 ఆర్థిక సంవత్సరం రెండవ సగం నుంచి పుంజుకోవడం ప్రారంభమయింది. ఇది మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద కొన్ని విదేశీ చెల్లింపులపై మూలం వద్ద పన్నును (టీసీఎస్) ఐదు శాతం నుంచి 20శాతం వరకు పెంచారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఈ రెమిటెన్స్లు తగ్గే అవకాశం ఉంది.
హాలీడేస్కు భారీ ఖర్చు..
2024 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్నెళ్లలో ఎల్ఆర్ఎస్ రెమిటెన్స్లో దాదాపు 51 శాతం ప్రయాణాలకు ఖర్చు అయింది. హాలీడేలకు 9.3 బిలియన్ డాలర్లు, దగ్గరి బంధువుల కోసం 3.05 బిలియన్ డాలర్లు, బహుమతుల కోసం 2.26 బిలియన్ డాలర్లు, విదేశాల్లో చదువుల కోసం1.8 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. కరోనా -సంబంధిత ప్రయాణ పరిమితుల కారణంగా, విదేశాలకు వెళ్లే చెల్లింపులు దాదాపు రెండేళ్లపాటు నిలిచిపోయాయి. అయితే ఇవి డిసెంబర్ 2021 నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 9.3 బిలియన్ డాలర్లకు చేరాయి. మహమ్మారి సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయడంతో చాలా భారతీయ కుటుంబాలు ఇప్పుడు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తిగా చూస్తున్నాయని గ్రాంట్ థార్న్టన్ ఇండియా పార్ట్నర్ రియాజ్ థింగ్నా చెప్పారు.