విదేశాలకు భారీగా డబ్బు.. పెరుగుతున్న ఔట్​వర్డ్​ రెమిటెన్స్​లు

విదేశాలకు భారీగా డబ్బు.. పెరుగుతున్న ఔట్​వర్డ్​ రెమిటెన్స్​లు

న్యూఢిల్లీ :  2022 ఆర్థిక సంవత్సరం నుంచి ఔట్​వర్డ్​ రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌లు పెరుగుతున్నాయి.  2024 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో, భారతీయులు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్​ఆర్​ఎస్​) కింద విదేశాలకు  పంపిన డబ్బు రికార్డు గరిష్ట స్థాయిలో 18.34 బిలియన్​ డాలర్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 37 శాతం పెరిగింది.   భారతీయులు ఒక ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్–- మార్చి) 2,50,000 డాలర్ల వరకు విదేశాలకు ఉచితంగా పంపవచ్చు. కరోనా సమయంలో ఎల్​ఆర్​ఎస్​ చెల్లింపులు తగ్గిపోయినప్పటికీ, ఇది 2022 ఆర్థిక సంవత్సరం రెండవ సగం నుంచి పుంజుకోవడం ప్రారంభమయింది. ఇది మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే లిబరలైజ్డ్​ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్​ఆర్​ఎస్​) కింద కొన్ని విదేశీ చెల్లింపులపై మూలం వద్ద పన్నును (టీసీఎస్​) ఐదు శాతం నుంచి 20శాతం వరకు పెంచారు.  దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఈ రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌లు తగ్గే అవకాశం ఉంది.

హాలీడేస్​కు భారీ ఖర్చు..

 2024 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్నెళ్లలో ఎల్​ఆర్​ఎస్​ రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌లో దాదాపు 51 శాతం ప్రయాణాలకు ఖర్చు అయింది.  హాలీడేలకు 9.3 బిలియన్ డాలర్లు, దగ్గరి బంధువుల కోసం 3.05 బిలియన్ డాలర్లు, బహుమతుల కోసం 2.26 బిలియన్ డాలర్లు,  విదేశాల్లో చదువుల కోసం1.8 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి.  కరోనా -సంబంధిత ప్రయాణ పరిమితుల కారణంగా, విదేశాలకు వెళ్లే చెల్లింపులు దాదాపు రెండేళ్లపాటు నిలిచిపోయాయి. అయితే ఇవి  డిసెంబర్ 2021  నుంచి క్రమంగా పెరుగుతున్నాయి.  ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 9.3 బిలియన్ డాలర్లకు చేరాయి. మహమ్మారి సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయడంతో  చాలా భారతీయ కుటుంబాలు ఇప్పుడు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తిగా చూస్తున్నాయని గ్రాంట్ థార్న్​టన్​ ఇండియా పార్ట్​నర్​ రియాజ్ థింగ్నా చెప్పారు.