
కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా ఓ పక్షి ఢీకొట్టింది. ఫ్లైట్ టాక్సీవేని దాటి టేకాఫ్కి సిద్ధమవుతున్న సమయంలో విమాన రెక్కలకు పక్షి బలంగా తగిలింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా బయపడ్డారు.
ఏం జరిగిందంటే..
మే 25వ తేదీ ఉదయం 8.30 గంటలకు 160మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో ఫ్లైట్ మంగళూరు నుంచి దుబాయ్ వెళ్తోంది. ఫ్లైట్ టాక్సీవేని దాటి టేకాఫ్కి సిద్ధంగా ఉన్నప్పుడు విమానం రెక్కలకు ఒక పక్షి తగిలింది. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన పైలెట్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించాడు. ఆ తర్వాత టేకాఫ్ ను రద్దు చేశారు. ప్రయాణికులు దుబాయ్ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విమానాన్ని సాంకేతిక నిపుణులు పరిశీలించారు.