
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో – 2023ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు ఇది హెచ్ఐసీసీలో జరగనుంది. ఫెడరేషన్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ, తొలిసారిగా తాము ఇలాంటి ఎక్స్పో నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి ఐసీఐసీఐ, ఫోర్ సోలార్, క్వాంటం ఎనర్జీ, స్టాండర్డ్ కిచెన్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, పోకర్ణ, టీఎస్ఐఐసీ, టీఎస్ఆర్ఈడీసీఓ, ఐఐఎంఆర్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఇక్రిశాట్, బీఎన్ఐ, టీ– వర్క్స్, టీఎస్టీపీసీ వంటి ప్రభుత్వ, ప్రైవేటు 128 సంస్థలు రానున్నాయని వెల్లడించారు.
వియత్నాం, మారిషస్, బెల్జియం, రస్ అల్ఖైమా నుంచి ప్రతినిధుల బృందాలు వస్తాయని చెప్పారు. మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటవుతాయని, ఇది బీ2బీ ఎగ్జిబిషన్ అని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీలను, ఇన్నోవేషన్లను ఎంకరేజ్చేసి ఆత్మనిర్భర్ భారత్ చొరవకు తోడ్పాటును ఇవ్వడానికే ఈ ప్రయత్నమని అగర్వాల్ అన్నారు.