కుర్రాళ్లకు పరీక్ష.. జులై 12న ఇండియా వెస్టిండీస్‌‌ మధ్య తొలి టెస్ట్‌‌

కుర్రాళ్లకు పరీక్ష.. జులై 12న ఇండియా వెస్టిండీస్‌‌ మధ్య తొలి టెస్ట్‌‌

రోసో (డొమినికా): వరుసగా రెండోసారి వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓడిన ఇండియా ఇప్పుడు కొత్త టెస్ట్‌‌ టీమ్‌‌పై దృష్టి పెట్టింది. సీనియర్ల కెరీర్‌‌ చివరి అంకానికి చేరుకోవడంతో వాళ్ల స్థానాలను భర్తీ చేసే యంగ్​స్టర్స్​ కోసం వేట మొదలుపెట్టబోతున్నది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌‌తో రెండు టెస్ట్‌‌ల సిరీస్‌‌లో భాగంగా బుధవారం మొదలయ్యే  తొలి మ్యాచ్‌‌తో కొత్త డబ్ల్యూటీసీని ఆరంభించనుంది. గత రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్‌‌తో పోలిస్తే ఈసారి ఇండియాకు బలమైన జట్ల నుంచి పోటీ ఎదురుకానుంది. దీంతో ఇప్పట్నించే పటిష్టమైన టీమ్‌‌ను రెడీ చేసుకోవాలని ప్లాన్స్‌‌ చేస్తోంది. అందుకే ఎక్కువగా కుర్రాళ్లపై ఫోకస్‌‌ చేసింది. ఇక వన్డే వరల్డ్‌‌కప్‌‌కు అర్హత సాధించలేకపోయిన విండీస్‌‌ కూడా తమ దేశంలో క్రికెట్‌‌కు ప్రాధాన్యత తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. 

ఓపెనర్‌‌గా ఎవరు?

విండీస్‌‌తో సిరీస్‌‌కు ఎంపిక చేసిన మొత్తం టీమ్‌‌ను పరిశీలిస్తే ఎక్కువ ఫోకస్‌‌ ఓపెనింగ్‌‌ ప్లేస్‌‌పైనే నెలకొంది. కెప్టెన్‌‌ రోహిత్‌‌కు తోడుగా బరిలోకి దిగేందుకు శుభ్‌‌మన్‌‌ గిల్‌‌తో పాటు యశస్వి జైస్వాల్‌‌ పోటీపడుతున్నాడు. ముంబై, వెస్ట్‌‌ జోన్‌‌లో ఓపెనింగ్‌‌ చేసిన యశస్వికే మొగ్గుంది. కరీబియన్‌‌ పేసర్లు కీమర్‌‌ రోచ్‌‌, గాబ్రియెల్‌‌, అల్జారీ, హోల్డర్‌‌లాంటి స్పీడ్‌‌స్టర్లను ఎదుర్కోవాలంటే మిడిల్‌‌ చాలా బలంగా ఉండాలి. ఈ నేపథ్యంలో కోహ్లీ, రహానెపై ఎక్కువ భారం పడకుండా గిల్‌‌ను మూడో ప్లేస్‌‌లో ఆడించే అవకాశాలే  ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్‌‌లో స్పీడ్‌‌స్టర్‌‌ బుమ్రా, షమీ లేకపోవడంతో పేస్‌‌ బాధ్యతలు మొత్తం హైదరాబాదీ సిరాజ్‌‌, శార్దూల్‌‌ ఠాకూర్‌‌పైనే ఉన్నాయి. అయితే విండీస్‌‌ ఫాస్ట్‌‌ పిచ్‌‌లను దృష్టిలో పెట్టుకుని నలుగురు పేసర్లను ఆడిస్తారా? లేక ఎక్స్‌‌ట్రా స్పిన్నర్‌‌ను తీసుకుంటారా? చూడాలి. ఒకవేళ నలుగురు పేసర్లతో వెళ్తే ముకేశ్‌‌ కుమార్‌‌, ఉనాద్కట్‌‌, సైనీలో ఎవర్ని ఎంచుకుంటారనేది కూడా ఆసక్తికరమే. స్పిన్నర్లుగా అశ్విన్‌‌ (474 వికెట్లు), జడేజా (268) మధ్య పోటీ నెలకొంది. వికెట్‌‌ కీపర్‌‌గా భరత్‌‌ ప్లేస్​ ఖాయమే అనొచ్చు. ఓవరాల్‌‌గా లిమిటెడ్‌‌ ఓవర్స్‌‌లో చెలరేగుతున్న టీమిండియా కుర్రాళ్ల టెస్ట్‌‌ సామర్థ్యంపై ఈ సిరీస్‌‌తో ఓ అంచనాకు రావొచ్చు.

బౌలర్లతోనే ప్రమాదం..

గత ఆరేళ్లుగా టెస్ట్‌‌ మ్యాచ్‌‌కు ఆతిథ్యమివ్వని విండ్సర్‌‌ పార్క్‌‌ను తొలి టెస్ట్‌‌కు వేదికగా ఎంచుకున్నారు. పేసర్లు రోచ్‌‌, గాబ్రియెల్‌‌ బౌలింగ్‌‌కు ఈ పిచ్‌‌ అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. అల్జారీ జోసెఫ్‌‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఈ ముగ్గురి నుంచి ఇండియన్‌‌ టాపార్డర్‌‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతం విండీస్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌లో క్రెయిగ్‌‌ బ్రాత్‌‌వైట్‌‌, బ్లాక్‌‌వుడ్‌‌ చాలా కీలకం. మిగతా వాళ్ల నుంచి కొద్దిగా సహకారం అందినా మంచి స్కోరును ఆశించొచ్చు. వన్డే వరల్డ్‌‌ కప్‌‌కు అర్హత సాధించకపోవడంతో విండీస్‌‌ తీవ్ర ఒత్తిడిలో ఉంది. దాంతో, ఈ సిరీస్‌‌ గెలిచి వరల్డ్‌‌ క్రికెట్‌‌లో తమ ఉనికిని  చాటుకోవాలని విండీస్‌‌ గట్టిగా ప్రయత్నించనుంది.