- డిసెంబర్ క్వార్టర్లో 7 శాతం తగ్గిన ఇన్ఫీ నెట్ ప్రాఫిట్
- రెవెన్యూ గైడెన్స్కు మరో క్వార్టర్లోనూ కోత
- సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే 2.5 శాతం పడిన టీసీఎస్ లాభం
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ ప్రాఫిట్స్ డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో తగ్గాయి. గ్లోబల్గా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో కంపెనీల పెర్ఫార్మెన్స్ అంతకు ముందు క్వార్టర్తో పోలిస్తే బలహీనంగా ఉంది. ఇన్ఫోసిస్కు క్యూ3 లో రూ. 6,106 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.6,586 కోట్లతో పోలిస్తే 7.3 శాతం తగ్గింది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్స్ (ఫ్రాపిట్ మార్జిన్) సెప్టెంబర్తో క్వార్టర్తో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్లో 70 బేసిస్ పాయింట్లు తగ్గగా, ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం ఒక శాతం తగ్గి 20.5 శాతంగా నమోదయ్యింది.
ఇన్ఫోసిస్ రెవెన్యూ గైడెన్స్కు మరోసారి కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ గైడెన్స్ను గతంలో వేసిన 1 శాతం – 2.5 శాతం నుంచి 1.5 శాతం –2 శాతానికి తగ్గించింది. కంపెనీకి డిసెంబర్ క్వార్టర్లో రూ. 38,821 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 1.3 శాతం ఎక్కువ. ఇన్ఫోసిస్ రెవెన్యూ రూ.38,630 కోట్లు ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు.
క్వార్టర్లో తమ పనితీరు బాగుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరీఖ్ పేర్కొన్నారు. 3.2 బిలియన్ డాలర్ల విలువైన పెద్ద డీల్స్ను గెలుచుకున్నామని, ఇందులో 71 శాతం కొత్త ఆర్డర్లు ఉన్నాయని అన్నారు. జనరేటివ్ ఏఐ, డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ వంటి టెక్నాలజీలలో ముందున్నామని చెప్పారు. కాగా, సెప్టెంబర్ క్వార్టర్లో 7.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ను ఇన్ఫోసిస్ పొందింది. కంపెనీ షేరు గురువారం రూ.1,520 దగ్గర ఫ్లాట్గా ముగిసింది. 6,101 మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు క్యూ3 లో మానేయగా, మొత్తం 3,22,663 మందికి తగ్గారు.
టీసీఎస్ రెవెన్యూ రూ. 60,583 కోట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్ ) రెవెన్యూ క్యూ3లో రూ. 60,583 కోట్ల (కన్సాలిడేటెడ్) కు పెరిగింది. 2022 డిసెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ. 58,229 కోట్లతో పోలిస్తే 4 శాతం గ్రోత్ నమోదు చేసింది. కంపెనీ నికర లాభం 2 శాతం వృద్ధి చెంది రూ. 10,846 కోట్ల నుంచి రూ.11,058 కోట్లకు చేరుకుంది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే మాత్రం డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్ నికర లాభం 2.5 శాతం తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకు రూ.27 డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది.
ఇందులో స్పెషల్ డివిడెండ్ కూడా కలిసి ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం తమ పెర్ఫార్మెన్స్ కొంత డల్గా ఉందని, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడమే ఇందుకు కారణమని టీసీఎస్ సీఈఓ కే కృతివసన్ పేర్కొన్నారు. డిసెంబర్ క్వార్టర్లో పెద్ద డీల్స్ పొందామని చెప్పారు. జనరేటివ్ ఏఐ సెగ్మెంట్లో మంచి డిమాండ్ కనిపిస్తోందని అన్నారు. టీసీఎస్ డిసెంబర్ క్వార్టర్లో 8.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ను దక్కించుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన 11.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే తగ్గింది. టీసీఎస్ షేరు గురువారం 0.37 శాతం లాభంతో రూ.3,727 దగ్గర సెటిలయ్యింది. కంపెనీ ఉద్యోగులు క్యూ3లో 5,680 మంది తగ్గారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,03,305 మంది.