లైంగిక వేధింపుల కేసులో డాక్టర్​ కల్యాణ్​ చక్రవర్తిపై ఎంక్వైరీ

లైంగిక వేధింపుల కేసులో డాక్టర్​ కల్యాణ్​ చక్రవర్తిపై ఎంక్వైరీ
  •     నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు  
  •     ఇప్పటికే పీఎస్​లో కేసు నమోదు 

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా వైద్యాధికారిని లైంగికంగా వేధించారంటూ సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, నాన్​కమ్యూనికబుల్​డిసీజెస్​అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిపై కేసు నమోదు కాగా ఆయనపై ఎంక్వైరీ చేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ కలెక్టర్ ప్రియాంక కమిటీ చైర్మన్​గా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డెవలప్​మెంట్​ఆఫీసర్, ​డీ‌ఎం‌హెచ్‌ఓ ఆఫీస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కమిటీ మెంబర్లుగా ఉంటారు. ఇందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ లో మహిళా వైద్యాధికారితో పాటు ఇద్దరు ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇద్దరు మహిళా సిబ్బందిని విచారించారు.  

పరారీలో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి..

డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారని, ఆయన కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ నెల 28న ఆయనపై సూర్యాపేట పీఎస్​లో కేసు నమోదు కాగా అప్పటి నుంచే 10 రోజులపై సెలవుపై వెళ్లాడని డీఎంహెచ్​వో డాక్టర్ కోట చలం తెలిపారు. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్​వస్తోందన్నారు. అయితే కల్యాణ్ చక్రవర్తి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.  

తప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు.. 

డాక్టర్ చక్రవర్తిని తప్పించేందుకు సొంత శాఖ ఆఫీసర్లే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆలన విభాగానికి చక్రవర్తి ప్రోగ్రామ్​ఆఫీసర్​గా ఉండగా, ఇదే విభాగంలో పనిచేసే మహిళ వైద్యాధికారిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు వచ్చాయి. అంతకుముందే ఇబ్బంది పెట్టగా మే 20న డీఎంహెచ్​వోకు ఫిర్యాదు చేశారు. చర్యలు లేకపోవడంతోనే మే 28న సూర్యాపేట టౌన్ పీస్​లో కంప్లయింట్​ చేశారు. ఇంటర్నల్ కమిటీ పేరుతో విచారణ చేపట్టకపోకపోవడంతోనే బాధితురాలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది.