
దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. భారత నౌకాదళ చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన యుద్ధ నౌకల్లో ఇదే అతి పెద్దది. ఇందులో 18 అంతస్తులు, 2300 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 2న కేరళలోని కొచ్చిన్ షిప్యార్డు లిమిటెడ్లో జల ప్రవేశం చేసింది. దీంతో విమాన వాహక నౌకలను సొంతంగా నిర్మించుకోగల సామర్థ్యం ఉన్న ఆరో దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా దగ్గర మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణానికి రూ.20,000కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ యుద్ధ నౌక తయారీకి 76 శాతం భారతీయ సాంకేతికతనే వినియోగించారు. ఎంఎఫ్ స్టార్ (నావర్ రాడార్ సిస్టమ్), టకాన్ (టాక్టికల్ ఎయిర్ నేవిగేషన్ సిస్టమ్), రేజిస్టర్–ఇ–ఏవియేషన్ కాంప్లెక్స్, శక్తి ఈడబ్ల్యూ స్వీట్, డ్రైవర్ డిటెక్షన్ సిస్టమ్ తదితర అత్యాధునిక వ్యవస్థలు విక్రాంత్లో ఉన్నాయి.
విక్రాంత్ డిజైన్ను భారత నౌకాదళంలోని వార్షిప్ డిజైన్ బ్యూరో తయారు చేసింది. ఈ నౌక నిర్మాణాన్ని కొచ్చిన్ షిప్యార్డ్ పూర్తి చేసింది. ఈ యుద్ధ నౌక నిర్మాణానికి 13 ఏండ్లు సమయం పట్టింది. ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. ఈ నౌకపై 30 యుద్ధ విమానాలు సౌకర్యవంతంగా నిలిపి ఉంచవచ్చు. మిగ్–29కే ఫైటర్ జెట్లు, కమోవ్–31, హెచ్ఆర్–60ఆర్ హెలికాప్టర్లు దీనిపై అందుబాటులో ఉంటాయి. 1971లో జరిగిన భారత్– పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు.