- మార్కెట్లో తక్షణమే సెటిల్మెంట్!
- వర్క్ జరుగుతోందన్న సెబీ చైర్పర్సన్ మాధవి
- కంపెనీల డీలిస్ట్కు ప్రమోటర్లే షేరు ధరను నిర్ణయించొచ్చు
- ఐపీఓ పేపర్లు సీక్రెట్గా ఫైల్ చేసేందుకు అనుమతి
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్చేంజిల్లో జరిగే ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ తక్షణమే పూర్తయ్యేలా చేయడంపై పనిచేస్తున్నామని సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ సోమవారం పేర్కొన్నారు. ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ ప్రాసెస్ వీలున్నంత వేగంగా జరగడంపై నిపుణులతో కలిసి పనిచేస్తున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకపోవచ్చని వివరించారు. ‘కొత్త ఈక్విటీ షేర్లను, బాండ్లను ఇష్యూ చేయడం, మ్యూచువల్ ఫండ్ స్కీమ్లకు అప్రూవల్స్ ఇవ్వడాన్ని మరింత వేగవంతం చేస్తాం. ఇందుకోసం టెక్నాలజీని వాడతాము. ఈ చర్యలతో ఇన్వెస్టర్లకు ఏడాదికి రూ.3,500 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి’ అని మాధవి వెల్లడించారు.
మ్యూచువల్ ఫండ్ ఫీజు స్ట్రక్చర్లో మార్పులు తేవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇండస్ట్రీ వర్గాలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. అంతేకాకుండా డీలిస్టింగ్ ప్రాసెస్ను ఫిక్స్డ్ ధర దగ్గర పూర్తి చేసేలా అనుమతి ఇస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో డీలిస్టింగ్ పూర్తవుతోంది. అంటే కంపెనీలు మర్చంట్ బ్యాంకర్లను నియమించి, ధరను నిర్ణయిస్తాయి. ఆ ధర దగ్గర షేర్ హోల్డర్లకు ప్రమోటర్లకు షేర్లను అమ్మాల్సి ఉంటుంది. సెబీ కొత్త రూల్తో ప్రమోటర్లే డీలిస్టింగ్ ధరను నిర్ణయించొచ్చు. దీనిని ఎన్ఎస్ఈ సబ్సిడరీ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ (బీఆర్ఎల్ఎం) వ్యాలిడేట్ చేస్తుంది. డీలిస్టింగ్ ప్రాసెస్లో మార్పులపై డిస్కషన్ పేపర్ను ఈ ఏడాది డిసెంబర్లోపు విడుదల చేస్తామని మాధవి అన్నారు. ‘ఒక్కసారి ఎంటర్ అయ్యాక, ఎగ్జిట్ కాలేకపోతున్నామనే ఫీలింగ్ ఎవరికీ కలగకూడదు. అందుకే వాలంటరీ డీలిస్ట్ కోసం ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చాం’ అని వివరించారు.
కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే ఐపీఓకి..
ఐపీఓ కోసం డ్రాఫ్ట్ పేపర్లను సీక్రెట్గా ఫైల్ చేయడానికి కూడా అనుమతి ఇస్తామని సెబీ చైర్పర్సన్ మాధవి అన్నారు. ‘కంపెనీలు సీక్రెట్గా ఐపీఓ పేపర్లను ఫైల్ చేయొచ్చు. మార్కెట్ పరిస్థితులను టెస్ట్ చేశాక, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే ఐపీఓకి రావొచ్చు. ఆ తర్వాతనే డ్రాఫ్ట్ పేపర్లోని విషయాలు పబ్లిక్లోకి వస్తాయి’ అని వెల్లడించారు. వీటితో పాటు ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్కు సంబంధించి కార్పొరేట్ డిస్క్లోజర్ రూల్స్ను కఠినం చేస్తామని చెప్పారు.
గ్లోబల్గా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఇండియా ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని అన్నారు. జీఎస్టీ కలెక్షన్స్ రికార్డ్ లెవెల్లో ఉన్నాయని, కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ పెరిగాయని గుర్తు చేశారు. కరెంట్ వాడకం కూడా ఎకానమీ పనితనానికి ఒక సూచిక అని చెప్పారు. మాన్యుఫాక్చరింగ్ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘క్యాపిటల్ సేకరణ వ్యవస్థ’లో తమ పాత్ర కీలకంగా మారిందన్నారు.