- కొత్త పాలసీలు తెస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా తర్వాత నుంచి డిజిటల్ వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో పాటే సైబర్ అటాక్లు, పర్సనల్ డేటా దొంగతనానికి గురికావడం, ఫిషింగ్, మాల్వేర్ వంటి సైబర్ అటాక్లు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి సైబర్ అటాక్ల నుంచి కంప్యూటర్లను, గ్యాడ్జెట్లను రక్షించుకోవడానికి, ప్రైవసీని కాపాడుకోవడానికి సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు సాయపడుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇక సాధారణమవుతుండడంతో ఆన్లైన్లో వర్క్ చేయడం పెరిగింది. ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త టెక్నాలజీలపై ఆధారపడడం ఎక్కువవుతోంది. ఎవరైనా మన పర్సనల్ డేటాను దొంగిలించి డబ్బులు డిమాండ్ చేసినా, ఐడెంటిటీని దొంగతనం చేసినా, ఈ–మెయిల్స్ పంపి మోసం చేసినా..ఇలా వివిధ సైబర్ అటాక్లను కవర్ చేసే పాలసీలను ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్సూరెన్స్లు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకంలో ఫస్ట్ పార్టీ కవరేజి ఉంటుంది. అంటే డైరెక్ట్గా కస్టమర్కు ఏదైనా సైబర్ పరమైన నష్టం జరిగితే ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. రెండోది థర్డ్ పార్టీ పాలసీలు. కస్టమర్ల డేటాను జాగ్రత్తగా ఉంచడంలో ఆర్గనైజేషన్లు ఫెయిలైతే ఈ థర్డ్ పార్టీ పాలసీలు కవర్ చేస్తాయి. ఎవరైనా మన కంప్యూటర్ డేటాను దొంగిలించి డబ్బులు కోసం డిమాండ్ చేసినా, ప్రకృతి వైపరీత్యం వలన కంప్యూటర్ హార్డ్వేర్ దెబ్బతిన్నా, వైరస్ లేదా మాల్వేర్ వలన కంప్యూటర్లో డేటా దెబ్బతిన్నా ఫస్ట్ పార్టీ పాలసీలు కవర్ చేస్తాయి. కాపీ రైట్ సమస్యలు, డొమైన్, ట్రేడ్ నేమ్ను ఇతరులు వాడుకోవడం వంటివి థర్డ్ పార్టీ పాలసీలు కవర్ చేస్తాయి.
రూ. 10 వేల నుంచి రూ. 5 కోట్ల వరకు కవర్..
ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ నష్టాలను కవర్ చేసే సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలను కంపెనీలు తెస్తున్నాయని సెక్యూర్నౌ ఇన్సూరెన్స్ సీఈఓ కపిల్ మెహతా అన్నారు. పాలసీలు తీసుకునేటప్పుడు వారంటీలు, మినహాయింపుల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలని, తాము ఎదుర్కొంటున్న సైబర్ అటాక్స్కు తగ్గట్టు పాలసీలను తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం రూ. 10 వేల– రూ. 5 కోట్ల వరకు కవరేజి అందించే పాలసీలున్నాయి.