డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ !..కామారెడ్డిలో అప్లికేషన్లు ఇచ్చిన 20 మంది

డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ !..కామారెడ్డిలో అప్లికేషన్లు ఇచ్చిన 20 మంది
  • ఎల్లారెడ్డి నుంచి ఎక్కువ మంది ఆశావహులు 

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్​కు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు 20 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి డీసీసీ ప్రెసిడెంట్ నియామకం కీలకం కానుంది. సమర్థవంతంగా పార్టీని నడిపించే లీడర్​కు డీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ తరఫున ఆయా జిల్లాలకు అబ్జర్వర్లను నియమించారు. 

కామారెడ్డి జిల్లాకు ఏఐసీసీ అబ్జర్వర్​గా రాజ్​పాల్ కరోల వచ్చారు. ఈ నెల 13 నుంచి 18 వరకు  జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 13న జిల్లా కేంద్రంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.  14 నుంచి నియోజకవర్గాల వారీగా మీటింగ్ నిర్వహిస్తున్నారు.  కామారెడ్డి జిల్లాలో ఈ నెల 13న జిల్లా నేతలతో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత 14న కామారెడ్డి నియోజకవర్గం, 15న ఎల్లారెడ్డి, 16న బాన్సువాడ, 17న జుక్కల్ నియోజకవర్గాల్లో మీటింగ్​లు  నిర్వహించి,  అభిప్రాయాలు సేకరించారు. 

 నేడు అప్లయ్ చేసిన వారితో అబ్జర్వర్ భేటీ...

డీసీసీ ప్రెసిడెంట్​పోస్టు కోసం అప్లయ్ చేసుకున్న వారితో శనివారం అబ్జర్వర్​ భేటీ కానున్నారు. పార్టీ కోసం వారు చేసిన సేవలు తదితర అంశాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.  

అప్లయ్ చేసుకున్న వారిలో.. 

నాలుగు నియోజకవర్గాల నుంచి డీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు.   కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం డీసీసీ ప్రెసిడెంట్​గా ఉన్న కైలాస్​ శ్రీనివాస్​రావుతోపాటు నిమ్మ విజయకుమార్​రెడ్డి, పంపరి శ్రీనివాస్, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్​రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి  మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్,   లింగాగౌడ్, గీరెడ్డి మహేందర్​రెడ్డి, నారెడ్డి మోహన్​రెడ్డి,   షరీఫ్, రఫీక్, బాన్సువాడ నుంచి ఎం. రాజిరెడ్డితోపాటు మరో ఇద్దరు, జుక్కల్ నుంచి  మల్లికార్జున అప్పాతో పాటు మరో ముగ్గురు డీసీసీ ప్రెసిడెంట్​కోసం అప్లయ్ చేసుకున్నారు. 

ఏఐసీసీ కొన్ని నిబంధనలు పెట్టింది. ప్రస్తుతం పదవి నిర్వహిస్తున్న వారికి ఇవ్వకూడదని పేర్కొన్నారు. దీంతో  కైలాస్​ శ్రీనివాస్​రావు పేరుపై సందిగ్ధత నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఈయన పేరును ఏకగ్రీవంగా ఇస్తున్నట్లు మీటింగ్​లో ప్రకటించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా అబ్జర్వర్​ను కలిసి పలువురు నాయకులు తమ అప్లికేషన్లను ఇచ్చారు.