- అటెండ్ కానున్న 9.80 లక్షల మంది స్టూడెంట్స్
- 1,521 సెంటర్లు.. 27,900 మంది ఇన్విజిలేటర్లు.. ప్రతి కేంద్రంలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ పరీక్షలకు పకడ్బందీ
- ఏర్పాట్లు చేసినం: ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఫస్టియర్లో 4,78,718 మంది, సెకండియర్లో 4,44,189 మంది స్టూడెంట్లు పరీక్ష రాయనున్నారు. వీరితో పాటు సెకండియర్లో ప్రైవేటు స్టూడెంట్లు ఇంకో 58,071 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 407 సర్కారు కాలేజీలు, 234 గవర్నమెంట్ సెక్టార్ కాలేజీలు, 880 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి.
200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్..
పరీక్షల నిర్వహణకు ప్రతి సెంటర్కు ఒకరి చొప్పున మొత్తం 1,521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 1,521 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. వీరితో పాటు 27,900 మంది ఇన్విజిలేటర్లను నియమించామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మాస్ కాపీయింగ్ నిరోధానికి 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ను, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రతి సెంటర్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.కాగా, పేపర్ లీకేజీలకు తావులేకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. దీంతో కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కాగా, విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించేందుకు అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ‘టెలిమానస్’పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 14416 లేదా 040- 24655027 నంబర్లకు కాల్ చేయొచ్చని సూచించింది.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్: శృతి ఓజా
ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా తెలిపారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదబాయి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్తో కలిసి ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పరీక్షల నిర్వహణకు అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయ కమిటీలు వేశామన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. స్టూడెంట్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని చెప్పారు. పరీక్షలు అంటే భయం ఉన్న స్టూడెంట్లు టెలిమానస్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున.. స్టూడెంట్లు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
స్టూడెంట్లకు సూచనలు..
ఉదయం 9 గంటలకు పరీక్షలు షురూ. గంట ముందే స్టూడెంట్లు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.స్టూడెంట్లు tsbie.cgg.gov.in సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకున్నా, పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎగ్జామ్ హాల్లోకి ప్రింటెండ్ నోట్స్, మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను అనుమతించరు.