- అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ పిలుపు
- దేశంలోని ఆర్య వైశ్యులందరినీ ఒకే ప్లాట్ఫామ్పైకి తీసుకొస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు రాజకీయంగా కూడా ఎదగాలని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) పేర్కొంది. ఆదివారం హైదరాబాద్లోని ముషీరాబాద్ వైశ్య హాస్టల్లో ఐవీఎఫ్ కల్చరల్ కమిటీ యువజన విభాగం రాష్ట్ర చైర్మన్గా వందనపు శైలేశ్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, కోచైర్పర్సన్లుగా గోగుల అనురాధ, కృష్ణవేణి స్వాతి, బాల భద్రుని సుష్మలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ సెంట్రల్ కమిటీ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రాజమౌళి గుప్తా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అంతర్జాయతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పేద వైశ్యులకు చదువుకోవడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఐవీఎఫ్ ముందుంటుందని పేర్కొన్నారు. ముషీరాబాద్ వైశ్య హాస్టల్లో పేద వైశ్య స్టూడెంట్స్ కోసం ఫ్రీ ఫుడ్తో పాటు అకామిడేషన్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఐవీఎఫ్ ఆధ్వర్యంలో 20 దేశాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఐఏఎస్ చదువుతున్న పేద ఆర్య వైశ్యులకు ఇప్పటికే 35 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేశామని వెల్లడించారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరినీ ఏకం చేస్తామని చెప్పారు. ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటారని, దీనిని ఇలాగే కొనసాగించాలని కోరారు. తెలంగాణలో ఐవీఎఫ్ను బలోపేతానికి నాయకులు, యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పేద ఆర్యవైశ్యులను ఆదుకోవడానికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. దేశంలో ఉన్న 16 కోట్ల మంది వైశ్యులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్రశేఖర్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్, స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్, ఫెడరేషన్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.