అబుబాబీ : ఇండియాలో జరిగిన ఐపీఎల్ 14 ఫస్ట్ ఫేజ్లో నానాతంటాలు పడిన కోల్కతా నైట్రైడర్స్.. నాలుగు నెలల బ్రేక్ తర్వాత కీలక పరీక్షకు రెడీ అయ్యింది. సోమవారం ఇక్కడ జరిగే మ్యాచ్లో తమ కంటే చాలా బలమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టనుంది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్లాడి రెండు విజయాలు సాధించిన నైట్రైడర్స్.. ప్లే ఆఫ్స్ బెర్త్పై ఆశలు పెట్టుకోవాలంటే తమకు మిగిలిన ప్రతీ మ్యాచ్లోనూ గెలవాలి. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పోరు రైడర్స్కు కీలకం కానుంది. మరోపక్క ఫస్ట్ ఫేజ్లో ఏడు మ్యాచ్లాడి ఐదు విజయాలతో టేబుల్లో మంచి పొజిషన్లో ఉన్న బెంగళూరు దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. ఏదేమైనా సెకండ్ ఫేజ్ను ఇరుజట్లు గెలుపుతో స్టార్ట్ చేయాలని భావిస్తుండటంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
బెంగళూరు జోరు కొనసాగేనా..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఐపీఎల్14 ఫస్ట్ ఫేజ్లో బెంగళూరు రెచ్చిపోయింది. వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి సత్తా చూపెట్టింది. మునుపటి ఫామ్ను కొనసాగిస్తే యూఏఈలో కూడా ఆర్సీబీకి తిరుగుండదు. కెప్టెన్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్తోపాటు గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ జట్టుకు అందుబాటులో ఉండటంతో బ్యాటింగ్ ఎప్పటిల్లాగే బలంగా ఉంది. పైగా, తమ జట్టు టేబుల్లో మంచి పొజిషన్లో ఉండటంతో వీరంతా స్వేచ్ఛగా ఆడనున్నారు. ఇక, ఈ సీజన్ తర్వాత టీ20 కెప్టెన్సీ వదులుకోనున్న విరాట్పైనే ఈసారి అందరి దృష్టి ఉంది. ఇక, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సేవలు కోల్పోవడం ఆర్సీబీకి కాస్త మైనస్. అయితే, సుందర్ ప్లేస్లో విరాట్ ఎవరిని ఫైనల్ ఎలెవన్లోకి తీసుకుంటాడో చూడాలి. బౌలింగ్లోనూ ఆర్సీబీకి సమస్యల్లేవు. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్కు తోడుగా హర్షల్ పటేల్, సైనీ, జెమీసన్తో లైనప్ బలంగా ఉంది. ఫస్ట్ ఫేజ్లో అదరగొట్టిన హర్షల్పై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. ఇక, రెగ్యులర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఫామ్ జట్టును కాస్త కలవరపెడుతోంది. యంగ్స్టర్ మహ్మద్ అజరుద్దీన్తోపాటు కొత్తగా జట్టులోకి వచ్చిన హసరంగ, చమీరా, టిమ్ డేవిడ్లో తుది జట్టులో ఎవరికి చాన్సు దొరుకుతుందో చూడాల్సి ఉంది.