- నాలుగు ఓటముల తర్వాత కేకేఆర్ గెలుపు బాట
- 5 వికెట్లతో పంజాబ్పై కోల్కతా నైట్ రైడర్స్ విక్టరీ
- రాణించిన బౌలర్లు, మోర్గాన్, త్రిపాఠి
- పంజాబ్కు నాలుగో ఓటమి
బౌలర్లు రాణిస్తే బ్యాట్స్మెన్ ఫెయిల్. టాపార్డర్ హిట్ అయితే మిడిలార్డర్ ఢమాల్. ప్రతీ పోరులో ఒకరిద్దరు ఆకట్టుకుంటున్నా టీమ్గా సత్తా చాటలేక వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఎట్టకేలకు ఆల్రౌండ్ షోతో మెప్పించి పంజాబ్ కింగ్స్ పని పట్టింది. తొలుత బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. చిన్న టార్గెట్ ఛేజింగ్లో టాపార్డర్ ఫెయిలైనా మిడిలార్డర్ బాధ్యత తీసుకోవడంతో లీగ్లో రెండో విక్టరీ సాధించింది..! మరోవైపు గత పోరులో పటిష్ట ముంబైని ఓడించి పుంజుకున్న పంజాబ్ మళ్లీ డీలా పడింది. బ్యాటింగ్ ఫెయిల్యూర్తో లీగ్లో నాలుగో ఓటమి మూటగట్టుకుంది..!
అహ్మదాబాద్: ఐపీఎల్14లో వరుస ఫెయిల్యూర్స్ నుంచి కోల్కతా బయటపడింది. చెన్నై, ముంబైలో తడబడిన కేకేఆర్.. అహ్మదాబాద్ రాగానే కమాల్ చేసింది. ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 రన్స్ చేసింది. మయాంక్ అగర్వాల్ (34 బాల్స్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 31). క్రిస్ జోర్డాన్ (18 బాల్స్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ (3/30) మూడు, నరైన్ (2/22), కమిన్స్ (2/31) చెరో రెండు వికెట్లు తీశారు. శివం మావి (1/13) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అనంతరం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్), రాహుల్ త్రిపాఠి (32 బాల్స్లో 7 ఫోర్లతో 41) రాణించడంతో కోల్కతా 16.4 ఓవర్లలో 126/5 స్కోరు చేసి గెలిచింది. మోర్గాన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
పంజాబ్ పడుతూ లేస్తూ..
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇన్నింగ్స్ చప్పగా సాగింది.ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (19), మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభమే ఇచ్చినా.. మిడిలార్డర్ తడబడడంతో నార్మల్ స్కోరుకే పరిమితం అయింది. చివర్లో క్రిస్ జోర్డాన్ మెరుపులతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పవర్ప్లేలో కేకేఆర్ యంగ్ పేసర్ శివం మావి అద్భుతంగా బౌలింగ్ చేయగా.. కమిన్స్ను టార్గెట్ను చేసిన మయాంక్, రాహుల్ షాట్లు కొట్టారు. సెకండ్ ఓవర్లో మయాంక్ సిక్సర్, రాహుల్ ఫోర్ రాబట్టాడు. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో సిక్సర్తో లోకేశ్ జోరు పెంచే ప్రయత్నం చేసినా.. తర్వాతి బాల్కే ఔట్ అవడంతో పంజాబ్కు తొలి దెబ్బ తగిలింది. అక్కడి నుంచి కింగ్స్ వరసగా వికెట్లు కోల్పోయింది. మావి బౌలింగ్లో డేంజర్ మ్యాన్ క్రిస్ గేల్ (0) గోల్డెన్ డకౌట్ అవగా.. ప్రసిధ్ వేసిన ఏడో ఓవర్లో దీపక్ హుడా (1) వెనుదిరిగాడు. వరుసగా వికెట్లు పడటంతో నెమ్మదిగా ఆడిన మయాంక్.. ప్రసిధ్ బౌలింగ్లో సిక్సర్తో మళ్లీ స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, 12వ ఓవర్లో నరైన్ అతడిని పెవిలియన్ చేర్చడంతో 60/4తో కింగ్స్ మరింత కష్టాల్లో పడింది. తన తర్వాతి ఓవర్లోనే హెన్రిక్స్ (2)ను బౌల్ట్ చేసిన నరైన్ మరో దెబ్బ కొట్టాడు. ఇక, తన బౌలింగ్లోనే 6,4 బాది ఊపు మీద కనిపించిన పూరన్ (19)ను 15వ ఓవర్లో చక్రవర్తి క్లీన్బౌల్డ్ చేయడంతో 78/6తో నిలిచిన పంజాబ్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ దశలో కాసేపు ప్రతిఘటించిన షారుక్ (13)ను ప్రసిధ్ ఔట్ చేయగా.. 19వ ఓవర్ ఫస్ట్ బాల్కే రవి బిష్నోయ్ (1)ను కమిన్స్ ఎనిమిదో వికెట్గా పెవిలియన్ చేర్చాడు. కానీ, అదే ఓవర్లో 4, 6 కొట్టిన క్రిస్ జోర్డాన్.. ప్రసిధ్ వేసిన లాస్ట్ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాది స్కోరు 120 దాటించి ఔటయ్యాడు.
ఆదుకున్న త్రిపాఠి, మోర్గాన్
17/3. చిన్న టార్గెట్ ఛేజింగ్లో మూడు ఓవర్లు ముగిసే సరికి కోల్కతా స్కోరిది. దాంతో, ఆ టీమ్కు మరో ఓటమి తప్పదనిపించింది. అయితే, కెప్టెన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి విజయానికి బాటలు వేశారు. స్టార్టింగ్లో మాత్రం ఆ టీమ్కు వరుసగా షాక్లు తగిలాయి. హెన్రిక్స్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బాల్కే నితీష్ రాణా (0).. షారుక్కు క్యాచ్ ఇవ్వగా, రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన శుభ్మన్ గిల్ (9)ను షమీ ఎల్బీ చేశాడు. సునీల్ నరైన్ (0) మళ్లీ నిరాశ పరిచాడు. అర్షదీప్ వేసిన థర్డ్ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన అతను డీప్ మిడ్ వికెట్ నుంచి దూసుకొచ్చిన రవి బిష్నోయ్ పట్టిన స్టన్నింగ్స్ క్యాచ్కు ఔటయ్యాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి రనౌటయ్యే ప్రమాదం తప్పించుకోగా.. షమీ బౌలింగ్లో 6, 4 బాదిన కెప్టెన్ మెర్గాన్ ఇన్నింగ్స్లో కదలిక తీసుకొచ్చాడు. అర్షదీప్ వేసిన ఐదో ఓవర్లో త్రిపాఠి కూడా రెండు ఫోర్లు బాది టచ్లోకి రాగా.. పవర్ప్లేలో 42/3తో కేకేఆర్ ఇన్నింగ్స్ కుదుట పడింది. ఆ తర్వాత కూడా త్రిపాఠి, మోర్గాన్ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టడంతో టీమ్పై ఒత్తిడి తొలగిపోయింది. అయితే, 11వ ఓవర్లో ఛేజ్ బౌలర్గా వచ్చిన దీపక్ హుడా బౌలింగ్లో త్రిపాఠి లాంగాన్లో షారుక్ క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్కు 66 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అయినా మోర్గాన్ జోరు కొనసాగించగా.. 36 బాల్స్లో 26 రన్స్ అవసరమైన టైమ్లో రసెల్ (10) రనౌటవడంతో పంజాబ్ రేసులోకి వచ్చేలా కనిపించింది. కానీ, మోర్గాన్ ఆ చాన్స్ ఇవ్వలేదు. హుడా వేసిన తర్వాతి ఓవర్లో 4, 6 కొట్టి మ్యాచ్ను తమవైపు లాగేసుకున్నాడు. ఆపై, దినేశ్ కార్తీక్ (12 నాటౌట్) రెండు ఫోర్లతో లాంఛనం పూర్తి చేశాడు.
స్కోర్ బోర్డు:
పంజాబ్: లోకేశ్ (సి) నరైన్ (బి) కమిన్స్ 19, మయాంక్ (సి) త్రిపాఠి (బి) నరైన్ 31, గేల్ (సి) కార్తీక్ (బి) మావి 0, హుడా (సి) మోర్గాన్ (బి) ప్రసిధ్ 1, పూరన్ (బి) చక్రవర్తి 19, హెన్రిక్స్ (బి) నరైన్ 2, షారుక్ (సి) మోర్గాన్ (బి) ప్రసిధ్ 13, జోర్డాన్ (బి) ప్రసిధ్ 30, బిష్నోయ్ (సి) మోర్గాన్(బి) కమిన్స్ 1, షమీ (నాటౌట్) 1, అర్షదీప్ (నాటౌట్) 1;
ఎక్స్ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 123/9;
వికెట్ల పతనం: 1–36, 2–38, 3–42, 4–60, 5–75, 6–79, 7–95, 8–98, 9–121;
బౌలింగ్: శివం మావి 4–0–13–1, నరైన్ 4–0–22–2, ప్రసిధ్ 4–0–22–3, రసెల్ 1–0–2–0, చక్రవర్తి 4–0–24–1.
కోల్కతా: గిల్ (ఎల్బీ) షమీ 9, రాణా (సి) షారుక్ (బి) హెన్రిక్స్ 0, త్రిపాఠి (సి) షారుక్ (బి) హుడా 41, నరైన్ (సి) బిష్నోయ్ (బి) అర్షదీప్ 0, మోర్గాన్ (నాటౌట్) 47, రసెల్ (రనౌట్) 10, కార్తీక్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు: 7; మొత్తం: 16.4 ఓవర్లలో 126/5;
వికెట్ల పతనం: 1–5, 2–9, 3–17, 4–83, 5–98;
బౌలింగ్: హెన్రిక్స్ 1–0–5–1, షమీ 4–0–25–1, అర్షదీప్ 2.4–0–27–1, బిష్నోయ్ 4–0–19–0, జోర్డాన్ 3–0–24–0, హుడా 2–0–20–1.