
టెహ్రాన్: అమెరికా దాడి చేయడానికంటే ముందే అత్యంత ప్యూరిటీ కలిగిన యురేనియంను ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించినట్లు అనుమానం వ్యక్తమవుతున్నది. ఫోర్డో తోపాటు మరో రెండు అణు కేంద్రాలనుంచి నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని తరలించినట్లు తెలుస్తున్నది. దాదాపు 400 కిలో గ్రాముల యురేనియంను విజయవంతంగా తరలించి ఉండొచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.
ఈ నెల 19, 20వ తేదీల్లో రాత్రిపూట భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు అణు శుద్ధి కేంద్రాల వద్ద బారులు తీరినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి. కచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతోనే ఇరాన్ అప్రమత్తమైనట్టు తెలుస్తున్నది.
అలాగే, 60 శాతం స్వచ్ఛత కలిగిన శుద్ధి చేసిన యురేనియంను, ఇతర కీలక పరికరాలను తరలించిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపినట్టు న్యూయార్క్ టైమ్స్కథనం ప్రచురించింది. అణ్వాయుధాల తయారీకి సాధారణంగా ఉపయోగించే 90 శాతం ప్యూరిటీకి ఇది చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నది. కాగా, ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులతో ఇరాన్ అణు సామర్థ్యం ‘పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని’ ట్రంప్ తన మద్దతుదారులకు తెలిపారు.
ఈ వ్యాఖ్యలను ఇరాన్ అధికారులు ఖండించారు. తమ అణు సదుపాయాలకు పెద్దగా నష్టం జరగలేదని, యురేనియం శుద్ధి చేసే సామర్థ్యం కూడా తగ్గలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా, విదేశాంగ శాఖ ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో తమకు తెలియదని అమెరికా ఉన్నతాధికారులు అంగీకరించారు. అలాగే, ఇదే విషయంపై ఇరాన్తో తాము చర్చించబోతున్నట్టు వారు చెప్పడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.