
జెరూసలెం(ఇజ్రాయెల్): ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. మొత్తం 15 మిసైళ్లను ప్రయోగించింది. కొన్నింటిని ఐరన్ డోమ్ అడ్డుకోగా.. మరికొన్ని మిసైళ్లు ఇజ్రాయెల్ నేలను తాకాయి. జెరూసలెంలోనూ భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవించాయి.
నార్తర్న్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆర్మీ అధికారులు సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ కేంద్రాలు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడింది. సైరెన్లు మోగిన వెంటనే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.
మిసైళ్లతో ఇరాన్ దాడులు చేస్తోందని హెచ్చరించారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 40 నిమిషాల పాటు నాన్స్టాప్గా ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అయితే, ఈ దాడుల్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదని.. పలు చోట్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ పేర్కొన్నది.
యుద్ధానికి ముగింపు మేమిస్తం..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధం ప్రారంభించింది మీరే అయినా.. ముగించేది మాత్రం తామే అని ట్రంప్ను ఉద్దేశిస్తూ ఇబ్రహీం హెచ్చరించారు. ట్రంప్.. ఓ గ్యాంబ్లర్ అని విమర్శించాడు. అమెరికా చేసిన దాడులను ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే.. అమెరికా ప్రవేశించడం ఏంటని మండిపడ్డారు. తమ దళాలు ఇజ్రాయెల్ సహా అమెరికా స్థావరాలపై మరిన్ని విస్తృత దాడులకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఇరాన్ ఏయిర్స్పేస్ నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా పెద్ద నేరం చేసిందని ఇబ్రహీం ఫైర్ అయ్యాడు. దాని ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించాడు.
మళ్లీ ఫోర్డో ప్లాంట్పై ఇజ్రాయెల్ అటాక్
ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున క్షిపణులతో దాడులు చేసింది. ఇప్పటికే అమెరికా ఫోర్డోతో సహా నతాంజ్, ఇస్ఫహాన్పై బాంబులతో అటాక్ చేసింది. తాజాగా ఇజ్రాయెల్ కూడా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది. ఇరాన్ మీడియా ఈ దాడుల విషయాన్ని వెల్లడించింది.
పవర్ గ్రిడ్లకు రిపేర్లు
విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. సౌత్ ఇజ్రాయెల్.. అష్డోడ్, నెగెవ్ ప్రాంతాల్లోని విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. అష్డోడ్ విద్యుత్ కేంద్రంపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ కారు డ్యాష్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దాడి తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. రాళ్లు, శిథిలాలు రోడ్డుపై వచ్చిపడ్డాయి. ఆ తర్వాత డ్రైవర్ వేగంగా కారును అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు.