
టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ఇరాన్ నిర్ధారించింది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని ఇరాన్ ప్రకటించింది. టెహ్రాన్ నుంచి చివరి రౌండ్ మిస్సైల్స్ ఇజ్రాయెల్పై దూసుకెళ్లాక ఇరాన్ ఈ సీజ్ ఫైర్ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్పై చేసిన మిస్సైల్స్ అటాక్లో ముగ్గురు చనిపోయారని ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ సర్వీస్ మాగెన్ డేవిడ్ ఆడమ్ (MDA) ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ చేసిన ప్రకటనను తొలుత తోసిపుచ్చిన ఇరాన్ గంటల వ్యవధిలోనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చినట్లు నిర్ధారించింది.
సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చాక కూడా ఇరాన్ మంగళవారం ఆరో సారి మిస్సైల్స్ దాడులు చేసిందని ఇజ్రాయెల్ మండిపడింది. ఇరాన్ చేసిన ఈ మిస్సైల్స్ దాడుల్లో బీ ఈర్ షెవా బిల్డింగ్ ధ్వంసమైంది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని, సీజ్ ఫైర్ కు అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ను అడుక్కున్నారని ఇరానియన్ మీడియా చెప్పుకొచ్చింది.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో ‘ఆపరేషన్ బేషరత్ ఫతా’ పేరుతో ఖతార్, ఇరాక్లోని అమెరికా ఎయిర్బేస్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఖతార్లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదీద్ పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్పైనా మిసైల్స్తో అటాక్ చేసింది. అల్ ఉదీద్.. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10 వేలమంది అమెరికన్ సైనికులు ఉన్నారు.
తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్హౌస్ వార్రూంలో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ భద్రతకు ముప్పు కలిగితే ఎవరినీ వదిలిపెట్టబోమని ఇరాన్వార్నింగ్ఇచ్చింది. అయితే.. 24 గంటల్లోనే సీజ్ ఫైర్కు ఇరాన్ అంగీకరించింది.