
- అమెరికా బీ2 బాంబర్లు తీవ్రంగా దాడి చేసినయ్
- ఇకపై ఐఏఈఏకు సహకరించకూడదని నిర్ణయం
టెహ్రాన్: అమెరికా చేసిన దాడుల్లో తమ న్యూక్లియర్ కేంద్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై తెలిపారు. తమ అణు స్థావరాలపై అమెరికా బీ2 బాంబర్లు చేసిన దాడి చాలా తీవ్రంగా ఉందని ఆయన ఒప్పుకున్నారు. బుధవారం అల్ జజీరా చానెల్తో ఆయన మాట్లాడారు. అయితే, అంతకుమించి మరిన్ని వివరాలను ఇస్మాయిల్ వెల్లడించలేదు. మరోవైపు ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ అణు కార్యక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కు సహకరించకూడదని ఇరాన్ పార్లమెంటు నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటులో చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేసింది. ఓటింగ్కు ముందు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ మాట్లాడుతూ ఐఏఈఏ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తమ దేశ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసినా ఐఏఈఏ ఖండించలేదని మండిపడ్డారు. దీంతో ఇకపై ఐఏఈఏకు సహకరించకూడదని అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ నిర్ణయించిందని తెలిపారు. తమ న్యూక్లియర్ స్థావరాల భద్రతకు హామీ ఇచ్చేవరకు ఐఏఈఏకు ఏమాత్రం సహకరించబోమని బఘేర్ స్పష్టం చేశారు. అదే సమయంలో తమ న్యూక్లియర్ కార్యక్రమాలు యథాప్రకారం కొనసాగుతాయని చెప్పారు.
న్యూక్లియర్ కేంద్రాలపై అమెరికా దాడి చేసే ముందే యురేనియంను తరలించామని తెలిపారు. కాగా.. ఇరాన్ అణు కార్యక్రమాలను గత కొన్నేండ్లుగా ఐఏఈఏ పర్యవేక్షిస్తున్నది. మరోవైపు, ఇరాన్ అణు కేంద్రాలను పరిశీలించే విషయమై ఆ దేశానికి ఇదివరకే లెటర్ రాశామని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసి తెలిపారు. ఇరాన్ అణు నిల్వలను పరిశీలించాల్సిన అవసరం ఉందని గ్రాసి పేర్కొన్నారు.