
న్యూ ఢిల్లీ: అమెరికా దాడికి ముందే ఇరాన్ అణు స్థావరాలనుంచి శుద్ధి చేసిన యురేనియం మాయమైనట్లు అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నాయి. దాదాపు 400 కిలో గ్రాముల యురేనియంను ఇరాన్ వేరేచోటికి తరలించినట్లు భావిస్తున్నాయి. ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా గత వారం జరిపిన వైమానిక దాడుల అనంతరం, సుమారు 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు కనపడకుండా పోవడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నది.
ఈ పరిణామం ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త అనుమానాలకు, భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తున్నది. ఈ యురేనియంను 60 శాతం శుద్ధి చేశారని, 90 శాతం గనుక శుద్ధి చేస్తే దీంతో అణ్వాయుధాలను తయారు చేయొచ్చని అమెరికా తెలిపింది. సుమారు 400 కిలోల యురేనియంతో 10 అణు బాంబులను తయారు చేయొచ్చని అంటున్నది..
ప్రత్యేక బాక్సుల్లో ఉంచి ట్రక్కుల్లో తరలింపు
ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ నగరాల్లోని ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా శక్తివంతమైన 'బంకర్ బస్టర్' బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనికి కొద్ది రోజుల ముందే ఇరాన్ ఈ యురేనియం నిల్వలను, కొన్ని కీలక పరికరాలను రహస్య ప్రదేశాలకు తరలించిందని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా, ఇరాన్ అణుకేంద్రాల్లో తనిఖీలను పునఃప్రారంభించాలని యూఎన్ భద్రతా మండలికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) చీఫ్ రఫెల్ గ్రాసీ స్పష్టం చేశారు.