అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటది : మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి

అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటది : మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి
  • అమెరికాకు ఇరాన్ విదేశాంగ శాఖ వార్నింగ్

టెహ్రాన్: ఇరాన్​లోని 3 న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి చేసి చాలా పెద్ద తప్పు చేసిందని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి అన్నారు. అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక అమెరికాకు శాశ్వత గాయం ఖాయమైందని వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంపై అమెరికా దాడి చేశాక చర్చలు అనేది సరైన ఎంపిక కాదన్నారు. దౌత్యం అనే దానికి ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయని, ఇప్పటికైతే దానికి అవకాశం లేదని తెలిపారు. అణు కేంద్రాలపై దాడి చేసి అమెరికా చాలా పెద్ద రెడ్‌‌‌‌లైన్‌‌‌‌ను దాటిందన్నారు. అంతర్జాతీయ చట్టాలను, న్యూక్లియర్ వెపన్స్ వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్​పీటీ) అమెరికా ఉల్లంఘించిందని తెలిపారు. 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా.. తాము ఏర్పాటు చేసుకుంటున్న అణుకేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. అమెరికాతో.. యూఎన్‌‌‌‌లోని సభ్యులు అప్రమత్తంగా ఉండాలని అబ్బాస్‌‌‌‌ సూచించారు. అమెరికా దాడులపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. యూనైటెడ్ నేషన్స్ చార్టర్‌‌‌‌లోని ఆర్టికల్ 51 ప్రకారం.. ఇరాన్‌‌‌‌కు స్వీయ రక్షణ హక్కు ఉందన్నారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.