
రాజధాని టెహ్రాన్ కు నైరుతిలో 100 కిలోమీటర్ల దూరంలో ఫోర్డో న్యూక్లియర్ కేంద్రం ఉంది. దీనిని ఒక కొండ కింద నిర్మించారు. యాంటీఎయిర్ క్రాఫ్ట్ బారియర్లతో ఈ కేంద్రాన్ని సంరక్షిస్తున్నారు. వైమానిక దాడులను తట్టుకునేలా దీనిని నిర్మించారు. బంకర్ బస్టర్ బాంబులు (భూమి ఉపరితలాన్ని చీల్చుకుని లోపలికి వెళ్లి పేలిపోయే బాంబులు) మాత్రమే ఈ కేంద్రాన్ని నాశనం చేయగలవని మిలిటరీ నిపుణులు తెలిపారు.
ఈ కేంద్రంలోనూ సెంట్రిఫ్యూజ్ కాస్ కేడ్స్ (ఇంధనాన్ని వేరుచేసి ఉంచిన పరికరాలు) ఉన్నాయి. 2007లో ఫోర్డో కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించినా ఆ విషయాన్ని ఐఏఈఏకు ఇరాన్ 2009లో తెలిపింది. అమెరికా, దాని మిత్రపక్షాలకు ఫోర్డో న్యూక్లియర్ కేంద్రం గురించి తెలియడంతో ఆ విషయాన్ని ఐఏఈఏకు ఇరాన్ వెల్లడించింది.
నతాంజ్లో 60% యురేనియం శుద్ధి
టెహ్రాన్ కు ఆగ్నేయంలో 220 కిలోమీటర్ల దూరంలో నతాంజ్ న్యూక్లియర్ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో యురేనియంను 60 శాతం వరకూ శుద్ధి చేశారని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. ఈ కేంద్రంలోని సెంట్రిఫ్యూజెస్ లో చాలా వరకు ధ్వంసం అయినట్లు ఐఏఈఏ భావిస్తోంది. అయితే, ఈ న్యూక్లియర్ కేంద్రంపై దాడి జరిగినా.. రేడియేషన్ ఆ సైట్ వరకే విస్తరించిందని పేర్కొంది. ఆ ప్రాంతం మొత్తం రేడియేషన్ వ్యాప్తి జరగలేదని వెల్లడించింది.
ఇస్ఫహాన్లో కొన్ని వేలమంది సైంటిస్టులు
టెహ్రాన్ కు ఆగ్నేయంలో 350 కిలోమీటర్ల దూరంలో ఇస్ఫహాన్ అణు ఇంధన కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రంలో కొన్ని వేలమంది న్యూక్లియర్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. అలాగే చైనాకు చెందిన మూడు రీసర్చ్ రియాక్టర్లు, ల్యాబరేటరీలు కూడాఈ కేంద్రంలో ఉన్నాయి.