
టెహ్రాన్: ఇంధన రవాణాకు ప్రపంచంలోనే అత్యంత కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. జూన్ 13న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేయాలని పలువురు ఇరాన్ రాజకీయ నాయకులు సూచించారు.
ఆ జలసంధి మూసివేసే ఆలోచన ఉందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) కమాండర్ ఇస్మాయిల్ కోవ్ శారీ తెలిపారు. ఇరాన్, ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల పరిధిలో ఇరుకైన పాయింట్ లో ఉన్న ఈ హర్మూజ్ జలసంధి.. పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతుంది.
గల్ఫ్ లో ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాలు ఆయిల్ ను ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న ఏకైక సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి మాత్రమే. ప్రస్తుతం ఈ ఒక్క చెక్ పాయింట్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇంధనం సరఫరా అవుతోంది.