
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందని, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ చెప్పింది పూర్తిగా పచ్చి అబద్ధమని, యుద్ధం కొనసాగుతూనే ఉందని ఇరాన్ ప్రకటించింది. తమ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులతో ట్రంప్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, ప్రజల్లో తనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకునేందుకు ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు ట్రంప్ తెరలేపారని ఇరాన్ మండిపడింది. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఇరాన్ ముందుకు కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదన రాలేదని ఇరానియన్ మీడియా కూడా స్పష్టం చేసింది.
ట్రంప్ చేసిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా స్పందించారు. ఇరాన్ ప్రజల గురించి, ఇరాన్ ప్రజల చరిత్ర గురించి తెలిసిన వాళ్లెవరూ ఇరాన్ సరెండర్ అవుతుందని భావించరని చెప్పుకొచ్చారు. ఇరాన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే ఇరాన్ నుంచి దాడులు ఆగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి తెలిపారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగిసిందని, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ తన అధికారిక ‘ట్రూత్’ సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేశారు. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా.. ఖతార్లోని అమెరికా మిలటరీ బేస్పై సోమవారం(జూన్ 23, 2025) ఇరాన్ మిస్సైల్ అటాక్ చేసిన గంటల వ్యవధిలో ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించడం గమనార్హం.
అయితే.. ఇరాన్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఇప్పటికి అయితే అధికారికంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని నిర్ధారించలేదు. ‘ఆపరేషన్ బేషరత్ ఫతా’ పేరుతో ఖతార్, ఇరాక్లోని అమెరికా ఎయిర్బేస్లపై ఇరాన్ విరుచుకుపడింది. ఖతార్లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదీద్ పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్పైనా మిసైల్స్తో అటాక్ చేసింది.