
ఇరాన్--ఇజ్రాయెల్ యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఇరు దేశాలు తగ్గేదేలే అన్నట్లుగా పరస్పర దాడులకు దిగుతున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ సైట్లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే.. ఇజ్రాయెల్ మిలిటరీని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగుతోంది. ఇందులో నాయకులు, ఆర్మీ అధికారులతో పాటు సామాన్యులు కూడా మృతి చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నట్లుండి అమెరికా ఇరాన్ పై దాడికి దిగింది. మూడు అణుకేంద్రాలను భారీ బాంబులతో పేల్చేసింది. ఇకనైనా శాంతి ఒప్పందానికి రావాలని ఇరాన్ ను హెచ్చరించారు ట్రంప్.
అమెరికా హెచ్చరికలను, దాడులను ఇరాన్ లెక్కచేసినట్లు కనపడటం లేదు. తమపై దాడికి నిరసనగా ఇజ్రాయెల్ పై మరోసారి భీకర దాడికి దిగింది. మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఆదివారం (జూన్ 22) ఒక్కసారిగా మిస్సైళ్లను వదలటంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యింది. జెరూసలెం లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. హైఫా, టెల్ అవివ్ ప్రాంతాలపై రెండు బ్యాచులుగా మొత్తంగా 27 మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్.
ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్ట్ ను టార్గెట్ చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మిస్సైల్స్ దాడిలో 11 మంది గాయపడగా వారిని రక్షించి చికిత్సకు తరలించారు ఇజ్రాయెల్ అధికారులు.
ఇరాన్ నుంచి మిస్సైళ్ల వర్షం కురుస్తుందని ఇజ్రాయెల్ కన్ఫమ్ చేసింది. ఇజ్రాయెల్ చుట్టూ సైరన్ ల మోతతో మార్గోగుతోంది. ఇరాన్ మిస్సైల్స్ లాంచ్ చేసిందని.. పబ్లిక్ స్టేటస్ లు, లొకేషన్లు షేర్ చేయవద్దని ఇజ్రాయెల్ మిలిటరీ సూచించింది. అమెరికా దాడి తర్వాత ఇజ్రాయెల్ లో వరుస దాడులకు ఇరాన్ దిగటంతో పరిస్థితి మరింత ఆందోళన కరంగా తయారయ్యింది.
అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడటం గమనార్హం. ఆదివారం ఉదయం ఇరాన్ లోని ఫార్దో, నతాంజ్, ఇన్ఫహాన్ అణు స్థావరాలపై దాడి చేసింది అమెరికా. బీ-2 స్పిరిట్ అనే భారీ బాంబర్లతో భీకర దాడులు జరిపింది. దాడుల అనంతరం ఇరాన్ లోని మూడు అను స్థావరాలపై బాంబులు వేసినట్లు ఆదివారం (జూన్ 22) ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగామని అధికారికంగా అనౌన్స్ చేశారు.
దాడులు చేశాం.. ఇక శాంతి ఏర్పాటు చేయాల్సి ఉంది.. శాంతి కావాలకంటే ఇరాన్ తగ్గాలని.. లేదంటే మరింత దూకుడుగా వ్యవహరిస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇరాన్ దాడులకు దిగటం ఆందోళన కలిగించే అంశం.
అంతే కాకుండా అమెరికా దాడులకు ప్రతీకారంగా ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ప్రారంభించింది.. మేము అంతం చేస్తామని హెచ్చరించింది. అమెరికా కూడా దాడులను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.
ఇక అంతకుముందే ఇరాన్ పై యూఎస్ దాడి చేస్తే ఎర్రసముద్రంలోని అమెరికా నౌకలను, ఆర్మీని టార్గెట్ చేస్తామని హౌతీ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్--ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా రావద్దని రష్యా హెచ్చరించింది. కానీ అమెరికా దాడితో ఇరాన్ కు మద్ధతుగా రష్యా, చైనా రంగంలోకి దిగుతాయా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.