
టెహ్రాన్: ఇరాన్ సమగ్రతను అమెరికా దెబ్బతీసిందని, అందుకే ఖతార్లోని యూఎస్ మిలటరీ స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. తమ మూడు న్యూక్లియర్ ప్లాంట్లపై అమెరికా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివరించారు. ఇకనుంచి ఇరాన్పై దాడులకు పాల్పడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక అమెరికన్ తమ టార్గెట్ అవుతాడని వార్నింగ్ ఇచ్చారు. యూఎస్ మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు.
ఐఏఈఏతో ఇరాన్ కటీఫ్
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ)తో తమ సహకారం నిలిపివేస్తున్నట్లు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ ఖలీబాఫ్ ప్రకటించారు. దీనికి సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని వివరించారు. ఐఏఈఏతో ఇరాన్ సహకారం తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని తెలిపారు. ఇరాన్ చేపట్టే న్యూక్లియర్ ప్రోగ్రామ్లకు సంబంధించిన సమాచారం ఏదీ ఇక నుంచి ఐఏఈఏకు అందదు. ఆ ప్రోగ్రామ్లను కూడా ఐఏఈఏ పరిశీలించే అవకాశం ఉండదు. దీంతో ఇరాన్ రహస్యంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.