
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు భీకరంగా సాగుతున్నాయి. వరుసగా ఏడవ రోజు ఇరు దేశాలు బాంబు, డ్రోన్లు, మిస్సైళ్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం (జూన్ 19) ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. పటిష్టమైన ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసి బాలిస్టిక్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్లోని ఆసుప్రతులు, పాఠశాలలు, సివిల్ ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.
టెల్ అవీవ్, రామత్ గాన్, హోలోన్, బీర్షెబాతో సహా ఇజ్రాయెల్లోని పలు నగరాలను ఇరాన్ మిస్సైళ్లు ఢీకొట్టాయి. హోలోన్లో నివాస ప్రాంతంలో మిస్సైల్ ఎటాక్తో ఒకరు తీవ్రంగా గాయపడగా, దాదాపు 30 మంది స్వల్పంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. బీర్షెబాలోని సోరోకా మెడికల్ సెంటర్ను ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆసుపత్రిలోని రోగులు, వైద్యులు, సిబ్బంది ప్రాణా అరచేతిలో పెట్టుకుని గజగజ వణికిపోయారు.
ఆసుపత్రి క్షిపణి దాడి జరిగిందని, ఫలితంగా చాలా నష్టం సంభంవించిందని సోరోకా ఆసుపత్రి ప్రతినిధి ఒకరు తెలిపారు.
సోరాకా ఆసుపత్రిపై ఇరాన్ మిస్సైల్ ఎటాక్ కు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో ప్రకారం మిసైల్ దాడిలో ఆసుపత్రి భారీగా డ్యామేజ్ అయ్యింది. వైద్యులు, పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీస్తోన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ మెరుపు దాడులతో ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడుల సైరన్లు మోగాయి. ఇరాన్ మిస్సైల్ దాడులతో ఇజ్రాయెల్కు విస్తృత నష్టం కల్గింది. ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ముగించి అణు ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించిన ఇరాన్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ట్రంప్ బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గని ఇరాన్.. తాము చెప్పినట్లుగానే ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన నెలకొంది. వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడటంతో ఇరాన్ పై అగ్రరాజ్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుందోననే దానిపై ప్రపంచ దేశాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.