‘నాకు జీతం ఎందుకు పెంచట్లేదు’ అని అడిగే ఉద్యోగులను చాలా చోట్ల చూస్తుంటాం. కానీ, ఐర్లెండ్లో ఓ ఉద్యోగి మాత్రం ‘నాకు జీతం ఎందుకు ఇస్తున్నారు?’ అని అడుగుతున్నాడు. ఏ పనీ చేయకపోయినా తనకు నెలకు కోటి రూపాయలకు పైగా జీతం వస్తోందట. దీంతో అతను ‘జీతమెందుకు ఇస్తున్నారు?’ అంటూ కోర్టుకెక్కాడు. ఇంతకీ జరిగిందేంటంటే..
ఐర్లెండ్లో రైల్వే ఉద్యోగి అయిన డెర్మోత్ అలస్టెర్కు గత కొన్నేండ్ల నుంచి ఉచితంగా జీతం ఇస్తున్నారట. ఏ పనీ చేయకుండా జీతం తీసుకోవడం అతనికి అవమానంగా అనిపించిందట. అందుకే ఈ విషయంపై అతను కోర్టుకెక్కాడు. డెర్మోత్ 2014లో కంపెనీ అకౌంటింగ్లో జరుగుతున్న ఫ్రాడ్ను బయటపెట్టాడు. అప్పటినుంచి అధికారులు అతనికి ఏ పనీ అప్పజెప్పట్లేదు. దాంతో రోజూ ఖాళీగా ఉండాల్సి వస్తోందని డెర్మోత్ కోర్టులో కంప్లెయింట్ చేశాడు. “నేను రోజూ రెండు న్యూస్ పేపర్లు, శాండ్విచ్ కొనుక్కుని ఆఫీసుకు వెళ్తా. నా క్యాబిన్లోకి వెళ్లి, కంప్యూటర్ ఆన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటా. కానీ, నాకు ఏ మెయిల్స్ రావు. దాంతో న్యూస్ పేపర్ చదివి.. శాండ్విచ్ తినేసి ఖాళీగా కూర్చుంటున్నా. వారంలో ఒక్క రోజైనా పనిచేసే అవకాశం దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తా. కానీ, నాకు ఏపనీ ఉండదు. నెలకు కోటి రూపాయలకు పైగా శాలరీ చెక్కు వస్తుంది. ప్రభుత్వం నా స్కిల్స్ వాడుకోవట్లేదు. నాపై వివక్ష చూపిస్తోంది. నన్ను ఒంటరితనం చికాకు పెడుతోంది” అని డెర్మోత్ పిటిషన్ రాశాడు. ఈ కేసు వచ్చే ఏడాది హియరింగ్కు వస్తుంది.