ప్రాజెక్టులకు భూసేకరణ స్పీడ్గా చెయ్యండి..అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం

ప్రాజెక్టులకు భూసేకరణ స్పీడ్గా చెయ్యండి..అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం

 

  • పారదర్శకంగా పరిహారం, పునరావాసం ఉండాలి
  • భూ సేకరణ ఎంత లేటైతే అన్ని సమస్యలు 
  • సమయం ఎక్కువ అయ్యేకొద్దీ ఖర్చులూ పెరుగుతయ్​
  • భూయజమానులతో చర్చించి ఓ కొలిక్కి తీసుకురండి
  • పాలమూరు-రంగారెడ్డి, సీతారామ సాగర్​ను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచన

హైదరాబాద్​, వెలుగు: పెండింగ్​ ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు  భూసేకరణను వేగవంతం చేయాలని  అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.  భూసేకరణ పరిహార సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. భూసేకరణపై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, న్యాయపరమైన చిక్కులు, పాలనాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. 

శనివారం సెక్రటేరియెట్​లో అధికారులతో ఆయన సమీక్షించారు. అన్ని జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను ఆరా తీశారు. ఇరిగేషన్​ కేవలం ప్రాజెక్టుల నిర్మాణాల కోసమే కాదని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆహార భద్రతకు కీలకమని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ఆయా ప్రాజెక్టులు ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించి పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.

 పాలమూరు – రంగారెడ్డి, సీతారామసాగర్​ వంటి ప్రాజెక్టులు కరువు ప్రాంతాలకు అత్యంత కీలకమని, ఆయా ప్రాజెక్టుల్లోని అన్ని దశల పనులకూ అత్యంత ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలన్నారు. కెనాల్​ లైనింగ్​ పనుల నుంచి టన్నెల్​ బోరింగ్​ పనులనూ ఎలాంటి అంతరాయాలూ లేకుండా చేపట్టాలని ఆయన సూచించారు.  

భూసేకరణ లేట్​ అవుతుండడమే పెద్ద నష్టం

భూసేకరణ ఆలస్యమవుతుండడమే ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిందని మంత్రి ఉత్తమ్​ అన్నారు. భూసేకరణ లేట్​ వల్ల సమయం ఎక్కువ అవుతుండడంతోపాటు ఖర్చులూ పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటే భూ యజమానులతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. పరిహారం, పునరావాసం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే ప్రజల నుంచి అంత వ్యతిరేకత వ్యక్తమవుతుందని, న్యాయపరమైన సమస్యలు తలెత్తి ప్రాజెక్టుల పనులు పెండింగ్​ పడతాయని  తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలన్నారు.  

వరదపై అల్టర్​గా ఉండండి

రిజర్వాయర్లకు ఎగువ నుంచి వరదలు వస్తుండడంతో అన్ని ప్రాజెక్టుల వద్ద అధికారులు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రాజెక్టుల నీటి మట్టాలను పరిశీలించాలని, ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీ ప్రొటోకాల్​ను యాక్టివేట్​ చేయాలన్నారు. ఓపెన్​ కెనాల్​ తవ్వలేని చోట సొరంగాల పనులు అత్యంత కీలకమని, ఈ విషయంలో డిపార్ట్​మెంట్​ సాంకేతిక సామర్థ్యం పెంచుకునేందుకు ఇద్దరు అత్యున్నత స్థాయి ఆర్మీ అధికారులను టన్నెల్​ నిర్మాణాల్లో భాగం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇరిగేషన్​ శాఖ గౌరవ సలహాదారుగా ఇండియన్​ ఆర్మీ మాజీ ఈఎన్సీ జనరల్​ హర్పాల్​ సింగ్​, డిపార్ట్​మెంట్​కు ఫుల్​టైంగా కల్నల్​ పరీక్షిత్​ మెహ్రా టన్నెల్​ ఇంజనీరింగ్​లో సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారులు రోహ్​తంగ్​, జోజిలా సొరంగాల నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. 

రాజేంద్రనగర్​లోని

వాటర్​ అండ్​ ల్యాండ్​ మేనేజ్​మెంట్​ ట్రైనింగ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ను పటిష్టపరచాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్​ శాఖ నిర్వహణలో శిక్షణ, రీసెర్చ్​కు అది అత్యంత కీలకమన్నారు. ఆ సంస్థ భూమిపై సర్వే చేయించాలని, కబ్జాలుంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇరిగేషన్​ ప్రాజెక్టులను టైమ్​కు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులపై ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ ఇవ్వాలని ఆదేశించారు.