
క్యాన్సర్తో పోరాటమంటే చావుతో నేరుగా పోరాటం చేయడమే. అలాంటి పోరాటంలో ఉన్నప్పుడు కరోనా సోకడం ఇంకెంతో ప్రమాదకరం. ఆ ప్రమాదం నుంచి ఇప్పుడు తప్పించుకోవడం క్యాన్సర్ పేషెంట్స్కి సవాలుగా ఉంది. ప్రపంచాన్ని మార్చిన కరోనా క్యాన్సర్ ట్రీట్మెంట్ని కూడా మార్చేసింది. ఆ విశేషాలను అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి. విజయ్ కరణ్ రెడ్డి లైఫ్తో పంచుకున్నారు.
క్యాన్సర్ పేషెంట్స్లో కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది?
క్యాన్సర్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా చేసే సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీల అయితే వీటిలో బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కీమోథెరపీ ఇమ్యూనిటీ మరింత ఎక్కువగా దెబ్బతీస్తుంది. అందువల్ల నార్మల్ పర్సన్ కంటే క్యాన్సర్ పేషెంట్స్ కోవిడ్ 19 బారినపడితే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి?
క్యాన్సర్ పేషెంట్స్ కరోనా బారిన పడకుండా అదనంగా తీసుకునే ప్రికాషన్స్ ఉండవు. సాధారణ వ్యక్తులు ఎలా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలో దానినే 100 శాతం పాటించాలి. మాస్క్ ధరించడం, చేతులు ముఖానికి తాకకుండా చూసుకోవడం, పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి.
క్యాన్సర్ పేషెంట్స్కి కరోనా సోకితే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపేస్తారా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మందికి కరోనా సోకవచ్చు. క్యాన్సర్ పేషెంట్కి కరోనా సోకితే ముందు కరోనా నుంచి బయటపడేయడానికే ప్రయత్నం చేస్తాం. క్యాన్సర్ టైప్, దాని స్టేజ్, అప్పటికే ఉన్న ట్రీట్మెంట్ని బట్టి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ఇమ్యూనిటీని కాపాడేందుకు మొదట ప్రయత్నిస్తాం. అందుకోసం ట్రీట్మెంట్లో మార్పులు చేస్తాం. క్యాన్సర్ ట్రీట్మెంట్లో మార్పులుంటాయి. కానీ, పూర్తిగా ట్రీట్మెంట్ని ఆపడం కుదరదు.
కీమోథెరపీ తప్పనిసరి అయిన పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కీమోథెరపీ పేషెంట్ వీలైనంత వరకు ఐసోలేషన్లో ఉండాలి. ఫ్యామిలీతో ఉన్నా ఐసోలేట్ అవ్వాలి. ఎవ్వరినీ కలవొద్దు. ఎక్కడికీ పోవద్దు. వాళ్లకు సాయపడే వ్యక్తి మాత్రమే వాళ్ల దగ్గరకు పోవాలి. ఏమైనా వస్తువులు ఆర్డర్ చేస్తే డెలివరీ వాళ్లు డోర్ దగ్గర వస్తువులు పెట్టిపోవాలి. వాళ్లను ఎవరూ డైరెక్ట్గా కాంటాక్ట్ కాకూడదు.
కోవిడ్ టైమ్లో కీమో థెరపీ ఇస్తుంటే కీమోథెరపీని ఆపి మందులు ఇవ్వడం మంచిది. లేకపోతే కీమోకి బదులుగా సర్జరీ చేసే అవకాశాలు పరిశీలించాలి. స్టేజ్ని బట్టి కీమోని వాయిదా వేయొచ్చు. స్టేజ్ వన్లో ఉంటే సర్జరీ చేసి, రెండు నెలల తర్వాత కీమోథెరపీ చేయాలి. కీమోథెరపీ చేయించుకున్న పేషెంట్ ఇంటికే పరిమితమవ్వాలి. కరోనా సోకే టైంకి కీమో నడుస్తుంటే దానిని బ్రేక్ చేయాలి.
కీమోథెరపీ చేస్తే ఇమ్యూనిటీ తగ్గుతుందా?
కీమో థెరపీ ఇచ్చినప్పుడు బోన్మారోలో ఉండే సెల్స్ డ్యామేజ్అవుతాయి. తెల్లరక్త కణాలన్నీ డ్యామేజ్ అవడం వల్ల బ్లడ్లో వాటి సంఖ్య బాగా పడిపోతుంది.ఈ స్థితిలో శరీరంపై ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ అటాక్ చేస్తే వాటిపై శరీరం సరైన పోరాటం చేయలేదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో (ఒక మైక్రో లీటర్ బ్లడ్లో) 7 నుంచి 8 వేల తెల్ల రక్తకణాలుంటే క్యాన్సర్ పేషెంట్లలో అంతకంటే తక్కువగా ఉంటాయి. వీళ్లలో మైక్రోలీటర్ బ్లడ్లో ఒకటి నుంచి రెండు వేల తెల్లరక్తకణాలు మాత్రమే ఉంటాయి. తెల్లరక్తకణాలు పెరిగేందుకు ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ యాంటీబాడీస్ని పెంచేందుకు మందులు లేవు. కరోనా వైరల్ లోడ్ తగ్గితేనే కీమోథెరపీ చేయాలి. కరోనా సోకితే కీమోథెరపీని వాయిదా వేస్తూ సర్జరీ, రేడియేషన్ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వైరస్ లోడ్ పూర్తిగా తగ్గిన తర్వాత కీమోథెరపీ చేయాలి.
క్యాన్సర్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి?
క్యాన్సర్ పేషెంట్స్ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు మంచి డైట్ తీసుకోవాలి. ప్రతి రోజూ ఆకు కూరలు ఎక్కువగా తినాలి. నాన్వెజ్ తినేవాళ్లయితే ఆయిల్, మసాలాలు బాగా తగ్గించాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ప్రొటీన్ కోసం మిల్క్, చికెన్ తీసుకోవాలి. రెడ్ మీట్ జీర్ణం కాదు. కాబట్టి దానిని తీసుకోవద్దు.
ఇమ్యూనిటీ ఎంతకాలానికి ఇంప్రూవ్ అవుతుంది?
క్యాన్సర్ నుంచి కోలుకున్నాక బాడీలో ఇమ్యూనిటీ నెమ్మదిగా పెరుగుతుంది. సర్జరీ అయిన తర్వాత ఒక నెలకు, రేడియేషన్, కీమోథెరపీ చేస్తే రెండు నెలలకు సాధారణ వ్యక్తులకు ఉన్నంత ఇమ్యూనిటీ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్లో పెద్దల్లో కంటే పిల్లల్లో ఇమ్యూనిటీ చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్ తినకుంటే ఇమ్యూనిటీ తగ్గదా?
క్యాన్సర్ పేషెంట్స్ సిట్రస్ ఫ్రూట్ తింటే అసిడిటీ సమస్యలొస్తాయి. అందుకే వాటిని తినొద్దు. కీమోథెరపీ చేయించుకున్నవాళ్లు సిట్రస్ ఫ్రూట్స్ (నిమ్మ, సంత్రాలు, బత్తాయి లాంటివి) తింటే అసిడిటీ విపరీతంగా పెరిగిపోతుంది. కీమోథెరపీ చేసినవాళ్లకు వాంతులు ఎక్కువగా అవుతుంటాయి. సిట్రస్ తింటే వాంతులు ఇంకా పెరుగుతాయి. రెగ్యులర్ డైట్ (క్యాన్సర్ పేషెంట్స్ తీసుకునే ఆకుకూరలు, కాయగూరలు)లో విటమిన్ సి శరీరానికి కావాల్సినంత ఉంటుంది. కాబట్టి విటమిన్– సి డెఫిషియెన్సీ రాదు.