
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఇరాన్లోని బాలిస్టిక్ మిసైల్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. సోమవారం ఆరు ఎయిర్పోర్ట్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్రకటించింది.
ఇంధనం నింపుకునే విమానంతోపాటు ఎఫ్14, ఎఫ్-5, ఏహెచ్1 ఫైటర్ జెట్స్ను ధ్వంసం చేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్ ఎయిర్ఫోర్స్ కెర్మాన్షా ప్రాంతంలో 15 యుద్ధ విమానాలతో ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాల ను ధ్వంసం చేసిందని తెలిపింది. ఈ క్షిపణులన్నీ ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటున్నాయనే కారణంతోనే వాటిని నాశనం చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది.
పలు బాలిస్టిక్ మిసైల్స్ను నిల్వ చేసిన ప్రాంతాలను, ప్రయోగ స్థావరాలను ఈ దాడుల్లో విజయవంతంగా ధ్వంసం చేశామని పేర్కొన్నది. అలాగే, ఇజ్రాయెల్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఓ డ్రోన్ను ఖోరామాబాద్ ప్రాంతంలో ఇరాన్ కూల్చివేసిందని ఐడీఎఫ్ వెల్లడించింది. కాగా, ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 400 మందికి పైగా మరణించారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన దాడుల్లో 24 మంది మృతిచెందారు.
టెహ్రాన్లోని జైళ్లపై బాంబుల వర్షం
టెహ్రాన్లోని ప్రభుత్వ సంస్థలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఎవిన్ జైలుతోపాటు పార్లమెంటరీ రెవల్యూషనరీ గార్డ్స్ సెక్యూరిటీ హెడ్క్వార్టర్స్ లక్ష్యంగా అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ దాడిలో జైలు గోడలు బద్ధలవడం వీడియోలో కనిపిస్తున్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లను.. తిరుగుబాటు చేసేవాళ్లను ఈ ఎవిన్ జైలులో ఉంచుతారు. ఇక్కడే కోర్టు ఉంటుంది.. ఉరిశిక్ష విధించడం, అమలు చేయడం, మృతదేహాన్ని పూడ్చి పెట్టడం చేస్తారు.
ఇక్కడ పని చేసే వాళ్లు నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతోనే టచ్లో ఉంటారు. ప్రస్తుతం ఈ జైలుపై ఇజ్రాయెల్ ఎటాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అలాగే, ఫోర్డోలోని భూగర్భ అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని మిసైల్స్, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.