
- మరో ఇద్దరు ఇరాన్ టాప్ జనరల్స్ మృతి
- 78 మంది పౌరులు మృతి.. 320 మందికి గాయాలు
- టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగం
- ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను ఛేదించిన క్షిపణులు
- ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మృతి.. 34 మందికి గాయాలు
- పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
జెరూసలెం: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. ఇరాన్పై శనివారం కూడా ఇజ్రాయెల్ ఎయిర్స్ట్రైక్స్ కొనసాగించింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ లో భాగంగా భీకర దాడులు చేసింది. ఇరాన్లోని అణుస్థావరాలు, మిసైల్ ప్రయోగ కేంద్రాలే టార్గెట్గా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని చాలాచోట్ల మిసైల్స్, జెట్స్తో ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో ఇరాన్కు చెందిన మరో ఇద్దరు టాప్ జనరల్స్ మృతిచెందారు. సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీ మృతి చెందినట్లు లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ మరణాలను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అలాగే, 78 మంది పౌరులు మృతి చెందగా.. 320 మందికి గాయాలైనట్టు ఇరాన్ తెలిపింది. తమ ఫోర్డో అణు కేంద్రానికి కొంత నష్టం జరిగినట్టు వెల్లడించింది. ఇక్కడి సామాగ్రిని వేరేచోటుకు తరలించినట్టు చెప్పింది. కాలుష్యం, రేడియేషన్కు సంబంధించి ఆందోళనలు లేవని ఇరాన్ స్టేట్అటామిక్ఎనర్జీ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు.
ఇరాన్ టాప్ లీడర్లే లక్ష్యంగా..
ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. టెహ్రాన్లోని మోనిరియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాసంసమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కాగా, ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఆయల్ రిఫైనరీ ఫజర్ జామ్ గ్యాస్ రిఫైనరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
మరిన్ని దాడులు చేస్తం: నెతన్యాహు
ఇరాన్ అణు కార్యక్రమాలను నాశనం చేసేందుకు ఇప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఇజ్రాయెల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్పై మరిన్ని దాడులు చేయబోతున్నామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో తమకు పొంచి ఉన్న ముప్పు తొలిగేదాకా దాడులు ఆపబోమని తేల్చి చెప్పారు. కాగా, ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి గురించి భారత ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్ చేసి వివరించారు. కాగా, ఈ యుద్ధానికి ఇరాన్ ప్రధాన కారణమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అంతర్జాతీయ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ షోషానీ తెలిపారు.
అణ్వాయుధాలను సాధించి ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టాలనే వారి ప్రయత్నమే తమను ఈ దాడికి ఉసిగొల్పిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మరోవైపు, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంపై యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరెస్ స్పందిస్తూ.. చర్చలతో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు.
టెల్అవీవ్ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడిని కొనసాగించింది. టెల్ అవీవ్ లక్ష్యంగా మిసైల్స్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను క్షిపణులు ఛేదించాయి. శనివారం ఇరాన్ ప్రయోగించిన వందలాది బాలిస్టిక్ క్షిపణుల్లో కొన్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఏకంగా టెల్ అవీవ్లోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినా ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా అడ్డుకోలేకపోయింది. ఇరాన్ నుంచి క్షిపణులు ప్రయోగించే ముందు సైరన్ మోగగా.. ప్రజలు సురక్షిత ప్రాంతాలవైపు పరుగెత్తడం వీడియోల్లో కనిపించింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో ఇరాన్ చేస్తున్న ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన ముగ్గురు పౌరులు మృతిచెందగా.. 34 మంది గాయపడ్డారు.