
- 370 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్లతో అటాక్.. ఐదుగురు పౌరులు మృతి
- సైనిక స్థావరాలు, గ్యాస్ఫీల్డ్స్, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతి దాడులు
- ఫ్యామిలీతో బంకర్లోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
- మాపై ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే ఆ దేశంపై పాక్ ప్రతిదాడి చేస్తదన్న ఇరాన్ ఐఆర్జీసీ జనరల్
టెల్అవీవ్: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరుదేశాలు నాలుగోరోజూ దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. సోమవారం ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ 370 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలో వార్నింగ్ సైరన్స్ ఏకధాటిగా వినిపించాయి. దాదాపు 30 ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ చేసిన దాడిలో ఐదురుగు ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఇరాన్ దాడిలో 24 మంది మరణించగా.. 592 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు ప్రదేశాలను తాకాయని ఆ దేశ సైన్యం తెలిపింది.
ఇరాన్ దాడుల తర్వాత హైఫా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. ఈవిషయాన్ని ఆ దేశ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ధ్రువీకరించింది. త్వరలోనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. అయితే, తాము టెహ్రాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ తెలిపారు. దాదాపు 120 ఇరాన్ మిసైల్స్ను ధ్వంసం చేశామని వెల్లడించారు. కాగా, తమ దేశ అణు కార్యక్రమాలు, గ్యాస్ ఫీల్డ్స్, సైనిక స్థావరాలపై దాడిచేస్తూ 224 మందిని చావుకు కారణమైన ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.
అమెరికన్ ఎంబసీపై మిసైల్
ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్అవీవ్లోని అమెరికన్ ఎంబసీపై పడింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని అమెరికన్ అంబాసిడర్ మైక్ హకేబీ ధ్రువీకరించారు. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు. టెల్ అవీవ్, జెరూసలెంలోని కార్యాలయాలు మూసే ఉంటాయని ట్వీట్ చేశారు. ఇరాన్ప్రజలు తగిన మూల్యం చెల్లించుకుంటరు తమ దేశ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు ఇరాన్ ప్రజలు తగిన మూల్యం చెల్లించుకొంటారని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఖట్జ్ ఓ ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హంతకుడిలా మారాడడని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టేందుకు సాధారణ పౌరులపై దాడులు చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు. కాగా, ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే ఇరాన్ పౌరులు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ‘ఎక్స్’లో కోరింది.
ఫ్యామిలీతో కలిసి బంకర్లోకి ఖమేనీ
ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తుండడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈశాన్య టెహ్రాన్లోని అండర్గ్రౌండ్ బంకర్లో ఖమేనీ ఫ్యామిలీతో కలిసి తలదాచుకున్నాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. శుక్రవారం ఖమేనీ నివాసానికి సమీపంలో ఇజ్రాయెల్ అటాక్ చేయడంతో ఆ రోజు రాత్రి ఆయనను లావిజాన్లోని బంకర్కు తరలించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
సురక్షిత ప్రాంతాలకు ఇండియన్ స్టూడెంట్స్
ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్లోని భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయాన్ని అక్కడి ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నందున భారత పౌరుల భద్రతను అక్కడి ఎంబసీ నిరంతరం పర్యవేక్షిస్తున్నదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నదని, కొంతమంది విద్యార్థులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిందని పేర్కొన్నది. పరిస్థితి మరింత తీవ్రంగా మారితే విద్యార్థులను భారత్కు తరలిస్తామని తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరపగా భూసరిహద్దుల మీదుగా తీసుకెళ్లవచ్చని ఇరాన్ చెప్పినట్లు ఎంఈఏ వెల్లడించింది.
ఇరాన్ టీవీ కేంద్రంపై మిసైల్ దాడి
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులు చేసింది. ప్రభుత్వ టీవీ ప్రధాన కేంద్రంపై దాడి చేయడంతో బిల్డింగ్ మొత్తం ధ్వంసమైంది. యాంకర్ లైవ్లో న్యూస్ చదువుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది, బిల్డింగ్ మొత్తం షేక్ అయింది. లైవ్ కావడంతో ఇదంతా ప్రేక్షకులు కూడా చూశారు. మరోవైపు, నైరుతి ప్రాంతంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసింది. ఇరాన్ ఆయిల్, గ్యాస్ సెక్టార్పై అటాక్ చేసింది. ఓ ఇంధన డిపో వద్ద భారీగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
దీనికిముందు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తూర్పు ఇరాన్లోని మషద్ విమానాశ్రయంలో ఇరాన్కు చెందిన ఓ విమానాన్ని ఢీకొట్టాయి. టెహ్రాన్కు మిస్సైల్ లాంచర్లు తీసుకెళ్తున్న ట్రక్కులపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) పేర్కొన్నది. కాగా, ఇజ్రాయెల్ ఇప్పటివరకూ జరిపిన దాడిలో ఇరాన్లో 400 మంది మరణించారని, అందులో 197 మంది సివిలియన్లు ఉన్నారని వాషింగ్టన్ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.