ఇరాన్‌ అరక్ అణు రియాక్టర్‌పై దాడి.. కన్ఫమ్ చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్

ఇరాన్‌ అరక్ అణు రియాక్టర్‌పై దాడి.. కన్ఫమ్ చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్

తెల్లవారు జాము నుంచి ఇరాన్ ఉత్తర-మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో జెరుసలేం, టెల్ అవీవ్ నగరాల్లోని అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులకు సంబంధించిన సైరన్లు మోగాయి. ఇరాన్ మిసైళ్లను తమ రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా ఇంటర్సెప్ట్ చేసి నిర్వీర్యం చేస్తున్నాయని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. 

ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా తన దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్‌లోని అరక్ హెవీ-వాటర్ న్యూక్లియర్ రియాక్టర్‌పై దాడి చేసినట్లు అధికారికంగా ధృవీకరించాయి. ప్రపంచ దేశాలు ఈ కేంద్రంలో ఆయుధాల కోసం ప్లూటోనియం ఉత్పత్తి చేసే సామర్థ్యాలు ఉండటమే వారి ఆందోళనలకు ప్రధాన కారణంగా ఉంది. అరక్-ఖోండాబ్ ప్రాంతంలోని నివాసితులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ కేంద్రంపై దాడులు జరిగాయి. ఈ దాడిని ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా అంగీకరించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి రేడియేషన్ ప్రమాదం గుర్తించబడలేదు. 2015లో ఇరాన్ ఆయుధాలు తయారు చేసేందుకు వినియోగించే ప్లుటోనియం తయారు చేయబోమని అంగీకరించినప్పటికీ రహస్యంగా అణు ఆయుధాలను తయారు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సహా పాశ్చాత్య దేశాల్లో అనుమానం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  

 

నేడు ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల్లో బీర్ షెవాలోని సోరోకా మెడికల్ సెంటర్ కూడా ఉంది. టెల్ అవీవ్, రామత్ గాన్, హోలోన్‌ ప్రాంతాల్లో కూడా అనేక క్షిపణి దాడులు జరిగాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇదే క్రమంలో లెబనాన్‌లోని లిటాని సెక్టార్‌లో పనిచేస్తున్న సీనియర్ హిజ్బుల్లా ఫిరంగి కమాండర్ యాసిన్ అబ్దేల్ మోనిమ్ ఎజ్జెడిన్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి.