
- పీఎస్ఎల్వీ - సీ58 రాకెట్ ద్వారా నిర్దేశిత 650 కిలోమీటర్ల లో ఎర్త్ ఆర్బిట్కు శాటిలైట్
- బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గెలాక్సీ కేంద్రకాలపై స్టడీ చేయనున్న ఎక్స్పోశాట్
- ఈ ఏడాది 12 నుంచి 14 మిషన్స్ చేపడ్తం: ఇస్రో చీఫ్ సోమనాథ్
శ్రీహరికోట (ఏపీ): కొత్త ఏడాదిని సూపర్ సక్సెస్తో ప్రారంభించింది ఇస్రో. గతేడాది నిర్వహించిన చంద్రయాన్, ఆదిత్య ప్రయోగాల విజయాలను కొనసాగిస్తూ.. కీలకమైన మరో ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్షంలోని కృష్ణ బిలాల (బ్లాక్ హోల్స్)పై స్టడీ కోసం తొలిసారిగా ‘ఎక్స్ రే పొలారిమీటర్ శాటిలైట్’ను ప్రయోగించింది.తనకు అచ్చొచ్చిన ‘పీఎస్ఎల్వీ– సీ58’ రాకెట్ ద్వారా సోమవారం ఎక్స్పోశాట్ సహా మొత్తం 11 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ప్రపంచంలో ‘ఎక్స్రే పొలారిమెట్రీ’పై మిషన్ను చేపట్టిన రెండో దేశంగా రికార్డులకెక్కింది.
21 నిమిషాల్లో కక్ష్యలోకి
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 9:10 గంటలకు పీఎస్ఎల్వీ– సీ58 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైమరీ పేలోడ్ (ఉపగ్రహం) ‘ఎక్స్పోశాట్’ను నిర్దేశిత 650 కి.మీలో ఎర్త్ ఆర్బిట్కు తీసుకెళ్లింది. నింగికి ఎగసిన 21 నిమిషాలకు కక్ష్యలోకి పంపింది. తర్వాత శాటిలైట్ ఆల్టిట్యూడ్ను 350 కిలోమీటర్లకు తగ్గించారు. పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పరిమెంటల్ మాడ్యూల్3 (పొయెమ్3)ని నిర్వహించేందుకు ఫోర్త్ స్టేజ్ను ప్రారంభించారు. ఇది పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చేపట్టిన 60వ మిషన్ కావడం విశేషం. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు పీఎస్ఎల్వీ ద్వారా మరో మిషన్ విజయవంతంగా చేపట్టినం. పీఎస్ఎల్వీ రాకెట్.. ప్రైమరీ శాటిలైట్ ఎక్స్పోశాట్ను నిర్దేశిత కక్ష్యలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహం సోలార్ ప్యానెల్ విజయవంతంగా పనిలోకి దిగింది” అని తెలిపారు.
ఐదేండ్ల పాటు స్టడీ..
ఎక్స్పోశాట్ను రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎక్స్పెక్ట్ (ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్) డిజైన్ చేశాయి. బెంగళూరుకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ తయారు చేసింది. ఈ మిషన్ జీవిత కాలం ఐదేండ్లు. దాదాపు 50 కాస్మిక్ రీసోర్సెస్ నుంచి వెలువడే ఎనర్జీలో ఎక్స్రేస్ పోలరైజేషన్ను కొలవడం, కాస్మిక్ ఎక్స్-రే రీసోర్సెస్పై దీర్ఘకాలిక స్పెక్ట్రల్, తాత్కాలిక స్టడీలను ఎక్స్పో శాట్ నిర్వహించనుంది. ఖగోళ మూలాల రేడియేషన్ మెకానిజం, జామెట్రీని పరిశీలించడానికి ఎక్స్-రే పోలరైజేషన్ అనేది కీలకమైన డయాగ్నస్టిక్ టూల్గా పనిచేస్తుంది. టైమ్, స్పెక్ట్రోస్కోపీ ఆధారిత పరిశీలనల సామర్థ్యంతో పాటు.. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గెలాక్సీ కేంద్రకాల(ఏజీఎన్) వంటి వాటిపై స్టడీ చేయనుంది. మన దేశంలో ఎక్స్-రే పోలారిమెట్రీలో నైపుణ్యాన్ని పెంపొందించడంలో, ఆస్ట్రోనమీ కమ్యూనిటీలో సహకార నెట్వర్క్ను ప్రోత్సహించడంలో ఈ మిషన్ కీలక పాత్ర పోషించనుంది.
మిగతా పది శాటిలైట్లు ఇవే..
తాజాగా చేపట్టిన ప్రయోగంలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా మొత్తం 11 ఉపగ్రహాలను ప్రయోగించారు. మొదట ‘ఎక్స్ పో శాట్’ను కక్ష్యలోకి పంపారు. దీనితో పాటు టేక్ మి టు స్పేస్ సంస్థకు చెందిన రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్పరిమెంట్ మాడ్యూల్.. ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మహిళా ఇంజినీర్లు తయారు చేసిన శాటిలైట్.. కేజే సోమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించిన బిలీఫ్ శాట్.. ఇన్స్పెసిటీ స్పేస్ లాబ్స్ తయారు చేసిన గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్.. ధ్రువ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ఎల్ఈఏటీటీడీ.. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ తయారు చేసిన రుద్ర 0.3 హెచ్ పీజీపీ, ఏఆర్ఏకే 200, పీఆర్ఎల్, ఇస్రో తయారు చేసిన డీఈఎక్స్ (డస్ట్ ఎక్స్పరిమెంట్).. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తయారు చేసిన ఫ్యూయెల్ సెల్ పవర్ సిస్టం, ఎస్ఐ బేస్డ్ హై ఎనర్జీ సెల్ కూడా ఉన్నాయి.
అమెరికా తర్వాత మనమే
అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) 2021 డిసెంబర్లో ‘ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్’ మిషన్ చేపట్టింది. సూపర్ నోవా పేలుళ్ల వల్ల వెలువడే అవశేషాలు, బ్లాక్ హోల్స్, ఇతర కాస్మిక్ ఈవెంట్ల ద్వారా వెలువడే పార్టికల్ స్ట్రీమ్స్ను స్టడీ చేసింది. మళ్లీ ఇలాంటి ప్రయోగం చేసింది ఇస్రోనే.
ఇస్రో సైంటిస్టులకు సీఎం రేవంత్ అభినందనలు
హైదరాబాద్, వెలుగు : ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ -సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో సైంటిస్టులకు అభినందనలతో పాటు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇది గగన్యాన్ సంవత్సరం : సోమనాథ్
ప్రతిష్టాత్మక మానవ సహిత మిషన్ ‘గగన్యాన్’ కోసం వరుస పరీక్షలను ఇస్రో ఈ ఏడాది నిర్వహించనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. 2024ను ‘గగన్యాన్’ ఇయర్ అని అన్నారు. 2024కు సంబంధించి ఇస్రో అజెండాను వివరించారు. ఈ ఏడాది 12 నుంచి 14 మిషన్స్ చేపట్టడానికి సిద్ధమవుతున్నా మని తెలిపారు. ‘‘టీవీడీ1 లేదా అబార్ట్ మిషన్తో గగన్యాన్ మిషన్ మొదలవుతుంది. ఈ సిరీస్లో నాలుగు ప్రయోగాలకు ప్లాన్ చేశాం. ఈ ఏడాది కనీసం మరో రెండు ప్రయోగాలు చేపట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం” అని వివరించారు. ఈ ఏడాది ‘నిసార్’ను జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు తెలిపారు.
గొప్ప ప్రారంభం : మోదీ
‘ఎక్స్పోశాట్’ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోను ప్రధాని మోదీ అభినందించారు. ‘‘2024కు గొప్ప ప్రారంభం ఇచ్చిన మన సైంటిస్టులకు థ్యాంక్స్. ఈ ప్రయోగం స్పేస్ సెక్టార్లో అద్భుతమైన వార్త. ఈ రంగంలో భారతదేశం నైపుణ్యాన్ని పెంచుతుంది. ఇండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఇస్రో సైంటిస్టులకు నా శుభాకాంక్షలు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.