
న్యూఢిల్లీ: ఈ–వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయని లేదా అండర్ రిపోర్టింగ్కు సంబంధించి 68వేల కేసులను నమోదు చేశామని ఐటీశాఖ ప్రకటించింది. ఇవన్నీ 2019-–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులని సీబీడీటీ చీఫ్ నితిన్ గుప్తా సోమవారం తెలిపారు. ఐటీ రిటర్న్లలో, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్)లో తేడాల గురించి ఐటీ విభాగం పన్ను చెల్లింపుదారులకు ఈ-–వెరిఫికేషన్ పథకం కింద తెలియజేస్తుంది. పొరపాట్లు/తేడాలు లేవనుకుంటే పన్ను చెల్లింపుదారులు వివరణ ఇవ్వవచ్చు. ఈ–వెరిఫికేషన్ నోటీసులో పొరపాటు ఉందని గమనిస్తే రివైజ్డ్ రిటర్న్లను ఫైల్ చేయవచ్చు.
మొత్తం 68వేల కేసుల్లో 35 వేల కేసులలో పన్ను చెల్లింపుదారులు తగిన సమాధానం ఇచ్చారని, మళ్లీ పన్ను రిటర్న్లను దాఖలు చేశారని గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 15 లక్షల అప్డేట్ రిటర్న్లు దాఖలయ్యాయని, రూ.1,250 కోట్ల విలువైన పన్ను వసూలయిందని వివరించారు. మిగిలిన 33వేల కేసుల్లో స్పందన రాలేదని పేర్కొన్నారు. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి అప్డేటెడ్ రిటర్న్లను ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఈ ఏడాది మార్చి 31 వరకు సమయం ఉంది. ఐటీఆర్ను అప్డేట్ చేసిన తర్వాత కేసును తిరిగి పరిశీలించడం లేదా అసెస్మెంట్ కోసం తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని గుప్తా తెలిపారు. ఈ–వెరిఫికేషన్ కోసం తీసుకున్న 68వేల కేసుల్లో పన్ను రిటర్న్ దాఖలు డిపాజిట్లకు సంబంధించి సోర్స్ నుండి తీసుకున్న డేటాకు, వచ్చిన డేటాకు మధ్య తేడా ఉందని అన్నారు. పన్ను చెల్లింపుదారులు వారి ఏఐఎస్ని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని, ఏదైనా తేడా ఉంటే తెలియజేయాలని గుప్తా సూచించారు.