- జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల, వెలుగు: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా శుక్రవారం కోరుట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన 123 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో నిండినప్పుడే పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. సీసీ కెమెరాలు లేని టైంలో కేసుల ఛేదన కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు వాటి సాయంతో విచారణ వేగంగా జరుగుతోందన్నారు.
కోరుట్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాములు, సీఐ సురేశ్బాబు, ఎస్ఐలు చిరంజీవి, రామచంద్రం, నవీన్కుమార్, శ్రీధర్రెడ్డి, డాక్టర్లు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
