రాజౌరీ/జమ్మూ : జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ఓ సైనికుడిని రక్షించే క్రమంలో కెంట్ అనే ఆర్మీ ఫీమేల్డాగ్ప్రాణాలు కోల్పోయింది. రాజౌరీ జిల్లాలోని మారుమూల నార్లా గ్రామంలో మంగళవారం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా భావిస్తున్న ఓ వ్యక్తిని సైనికులు మట్టుబెట్టారు. అయితే, ఆర్మీ డాగ్తో పాటు ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు సోల్జర్లకు గాయాలయ్యాయి. ‘‘ఆర్మీ డాగ్ యూనిట్లోని లాబ్రడార్ జాతికి చెందిన కెంట్ తన హ్యాండ్లర్ను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించింది.
ALSO READ: కరెంట్ షాక్ పెట్టి ఆవులను చంపేసిన్రు
ఆపరేషన్ సుజలిగలలో కెంట్ ముందంజలో ఉంది. టెర్రరిస్టులను గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ లో కెంట్ సైనికుల బృందానికి నేతృత్వం వహిస్తోంది. భారీ ఎదురుకాల్పుల్లో తన హ్యాండ్లర్ను రక్షించే క్రమంలో బుల్లెట్ గాయాలపాలై కన్నుమూసింది’’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా నార్లా గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్లో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరో టెర్రరిస్ట్ హతమయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా, కెంట్కు సైన్యం నివాళులు అర్పించింది. దేశం కోసం కెంట్ చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ.. సెర్చ్ ఆఫ్ డ్రిల్లో సైనికులను కెంట్ ముందుండి నడిపించిన వీడియోను ఎక్స్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.
మరో ఘటనలో ముగ్గురు..
అనంత్నాగ్లో జరిగిన మరో ఎన్ కౌంటర్లో కర్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్ చక్, డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్ చనిపోయారని అధికారులు తెలిపారు.