నల్గొండ, వెలుగు: సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి మాట మార్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్టు చెప్పిన ఆయన.. హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేయడానికి తానేమీ ఆషామాషీ వ్యక్తిని కాదని, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, చాలాకాలం మంత్రిగా పనిచేసిన తాను టికెట్ కోసం అప్లై చేసుకోవడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. కొడుకులకు బదులు చివరిసారిగా జానారెడ్డినే పోటీ చేయాలని నాగార్జునసాగర్ కేడర్ ఒత్తిడి చేస్తోంది.
జానారెడ్డి నిలబడితే బీఆర్ఎస్ అసమ్మతి వర్గం సపోర్ట్ చేయడానికి కూడా సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నరు. కమ్యూనిస్టులతో పొత్తు కుదరాలంటే జానారెడ్డి మధ్యవర్తిత్వం అవసరం అవుతుందని, ఆయన క్రియాశీలంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామని ప్రకటించిన సీనియర్ నేతల్లో జానారెడ్డి కూడా ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్కు పూర్వవైభవం తేవాలంటే జానాతోనే సాధ్యమని కేడర్ భావిస్తోంది. ఒకవేళ జానారెడ్డి పోటీ చేయాల్సి వస్తే నాగార్జునసాగర్ నుంచే నిలబడతారని అంటున్నారు.