
జనగామ అర్బన్/ ములుగు, వెలుగు: వినాయక చవితిని శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్లు రిజ్వాన్భాషా షేక్, దివాకర సూచించారు. సోమవారం జనగామ, ములుగు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అధికారులు సిబ్బంది విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
రోడ్లు భవనాల శాఖ బారికేడ్స్ పటిష్టంగా ఏర్పాటు చేయాలని, విద్యుత్ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని, భద్రతా పరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, జనగామ కలెక్టరేట్లో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. మహబూబాబాద్ తొర్రూరులో వినాయక చవితి నిర్వహణ ఏర్పాట్లపై డీఎస్పీ కృష్ణ కిశోర్ పోలీసు సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు.