వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ అంధకారం అవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట రైతు భరోసా సభలో పాల్గొన్న పవన్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. అక్కడ 60 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్... అధికార వైసీపీ పైన విమర్శలు చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న పవన్.. వారికి రూ.7 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముద్దుల మావయ్యను మళ్లీ ఆదరిస్తారా అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు గ్రామాభివృద్ధికే కేటాయిస్తామని ఈ సందర్బంగా హమీ ఇచ్చారు పవన్. అధికారంలో లేకపోయినా కౌలు రైతులకు సహయం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే కౌలురైతుల కుటుంబాలకు రూ.కోట్లు సాయం చేశామని తెలిపారు. జేబులో డబ్బులు తీసి ఇవ్వడం తమకేమీ సరదా కాదని పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు జగన్ ఇష్టపడటం లేదన్నారు.
ఇక 2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని, జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమ ప్రణాళికను వెల్లడిస్తామని తెలిపారు.