జనగామ, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అధికార పార్టీలో వర్గ పోరు తీవ్రమైంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య హీట్ మరింత పెరుగుతోంది. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ సారి టికెట్ తమదేనంటే తమదేనంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
దూకుడు పెంచిన కడియం
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నియోజకవర్గంలో దూకుడు పెంచారు. గత రెండేండ్లుగా ఎమ్మెల్యే రాజయ్యపై కౌంటర్లు వేస్తున్న శ్రీహరి దశాబ్ది ఉత్సవాలే వేదికగా స్పీడ్ మరింత పెంచారు. ఇటీవల గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు ఎమ్మెల్సీ హాజరై స్టేషన్ ఘన్పూర్లో అవినీతి పెరిగిపోయిందని, దానిని అరికడుతానని బహిరంగంగా ప్రకటించారు. అలాగే ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ‘అంబేడ్కర్ ఆశయాలు సాధించాలంటే నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండాలి, అవకాశమొస్తే పది గ్రామాలకు లేదా పది కుటుంబాలకు సాయం జెయ్యాలె, ఎమ్మెల్యే గా ఉన్నపుడు చేసిన పనులను ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకోవాలె. అధికారముందని విర్రవీగవద్దు’ అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు. రాబోయే రోజులు మనవేనంటూ కేడర్కు సంకేతాలు ఇస్తున్నారు.
రాజయ్యకు తప్పని నిలదీతలు
ఎమ్మెల్యే రాజయ్యకు నియోజకవర్గంలో నిలదీతలు తప్పడం లేదు. ఈ నెల 16న స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో చేపట్టిన ప్రగతి నివేదన యాత్రకు హాజరైన జనంగ్రామానికి ఏం చేసినవ్ ? అభివృద్ధి పనులేవి ? అంటూ ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. 17న రఘునాథపల్లి మండలం మంగలిబండ తండాలో చేపట్టిన కార్యక్రమంలో సైతం గ్రామాభివృద్ధికి ఏం చేశారు ? ఏం చెయ్యనప్పుడుగ్రామంలోకి రావొద్దంటూ ప్రజలు నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే తన పర్యటన ర్దదు చేసుకొని వేరే గ్రామానికి వెళ్లారు. లింగాలఘన్పూర్, జఫర్గఢ్ మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం ప్రజలు పలు సమస్యలు, డబుల్ ఇండ్లపై ఎమ్మెల్యేను నిలదీశారు. బండ్లగూడెంలో ఏకంగా సొంత పార్టీ నేతలే దళితబంధుపై ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిలదీతల వెనుక కడియం వర్గం ఉందని రాజయ్య అనుచరులు ఆరోపిస్తున్నారు.
ALSO READ :ఛీ యాక్ : విమానంలో సీట్ల మధ్య చుచ్చూ పోసిన ప్రయాణికుడు
టికెట్పై ఎవరికి వారే ధీమా
స్టేషన్ఘన్పూర్ టికెట్ తనదేనంటే తనదేనంటూ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధీమాగా ఉన్నారు. ప్రత్యర్థి వర్గాన్ని పలుచన చేసేందుకు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. గత ఎన్నికల టైంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోగా చివరి రోజుల్లో కడియంకు నచ్చజెప్పి రాజయ్యకు టికెట్ ఇచ్చారు. కానీ వచ్చే ఎలక్షన్స్లో వెనక్కి తగ్గే చాన్సే లేదని కడియం అనుచరులు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజయ్య మాత్రం స్టేషన్ ఘన్పూర్టికెట్ తనదేనంటూ ప్రతీ మీటింగ్లో ధీమా వ్యక్తం
చేస్తున్నారు.