జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాలో యూరియా కొరత లేదని ఇన్చార్జి కలెక్టర్ పింకేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలకు అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం ఆయన జనగామ మండలంలోని పీఏసీఎస్ కేంద్రాలు, ఓబుల్ కేశపూర్లోని యూరియా సరఫరా పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా యూరియా, ఎరువుల లభ్యత, పంపిణీ పరిస్థితిపై ఆరా తీశారు.
నిల్వలు, సరఫరా విధానం, రైతులకు పంపిణీ ప్రక్రియ, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ, డిమాండ్ సరఫరా సమతుల్యత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అంతకుముందు కలెక్టరేట్లో గురుకులాల, వివిధ సొసైటీల రెసిడెన్షియల్ స్కూళ్లలో బ్యాక్లాగ్, కొత్త అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పరీక్ష పోస్టర్ను ఆయన అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఆవిష్కరించారు.
